ప్రైవేటుకే సైనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకే సైనింగ్‌

Jun 21 2025 3:59 AM | Updated on Jun 21 2025 3:59 AM

ప్రైవేటుకే సైనింగ్‌

ప్రైవేటుకే సైనింగ్‌

జిల్లాలో 160 మందికి ప్రదానం

వారిలో 143 మంది ప్రైవేట్‌

పాఠశాలల విద్యార్థులే

ప్రభుత్వ స్కూళ్లలో 30 మందికే అవకాశం

ఎంపిక తీరుపై విమర్శలు

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం ఇటీవల ప్రదానం చేసిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల్లో ప్రైవేటు విద్యాసంస్థలకే పెద్దపీట వేశారా? ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వలేదా? ప్రభుత్వ నిధులతో ఇచ్చే ప్రోత్సాహకాల్లో ప్రైవేటుకు పెత్తనం వేయడం వెనుక మతలబు దాగుందా? ప్రైవేటు విద్యా సంస్థలకు మేలు జరిగే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందా? అంటే విద్యావేత్తల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల నిర్వహించిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రదానోత్సవానికి విద్యార్థులను ఎంపిక చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం ద్వారా ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు పట్టం కడుతోందంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.

పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ పేరిట ప్రభుత్వం ఇటీవల అవార్డులు ప్రదానం చేసింది. జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమం రాజమహేంద్రవరంలోని శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి హాలులో నిర్వహించారు. ఈ అవార్డులకు జిల్లావ్యాప్తంగా 169 మంది విద్యార్థులను గుర్తించి, వారికి అవార్డుతో పాటు రూ.20 వేల నగదు పారితోషికం, మెడల్‌, ప్రశంసా పత్రం అందజేశారు.

ఆ విద్యార్థులకే పెద్దపీట

● ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. అయితే, ఎంపిక జరిగిన తీరుపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

● షైనింగ్‌ స్టార్స్‌గా ఎంపిక చేసిన 169 మందిలో 143 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులే ఉన్నారు.

● పాఠశాలల కేటగిరీలో 121 మందిని ఎంపిక చేయగా వీరిలో 100 మంది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 21 మందిని మాత్రమే ఎంపిక చేశారు.

● కళాశాలల కేటగిరీలో 48 మంది అర్హత సాధించగా వీరిలో సైతం అత్యధికంగా 43 మందిని ప్రైవేటు కళాశాలల విద్యార్థులున్నారు. ప్రభుత్వ కళాశాలల నుంచి ఐదుగురిని మాత్రమే ఎంపిక చేశారు.

● వాస్తవానికి పేదరికం వంటి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మరీ ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదివి, ప్రతిభ చూపిన విద్యార్థులను అధిక సంఖ్యలో ఎంపిక చేసి ఉంటే బాగుండేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు.

● షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేసిన తీరు చూస్తే.. ప్రైవేటు పాఠశాలలే మేలనే భావన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కలుగుతుందని విమర్శిస్తున్నారు. దీనివలన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడి ప్రైవేటు బాట పట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ప్రభుత్వ ధనం.. వారికి అందలం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, ఉపాధ్యాయుల వేతనాలకు ఏటా రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యతో పాటు ట్యాబ్‌లు, స్మార్ట్‌ తరగతుల వంటి అనేక అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు షైనింగ్‌ స్టార్స్‌ ఎంపికలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుందనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంటోంది. అవార్డులకు ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తూ ప్రైవేటుకు అందలం వేయడమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కులాల ప్రాతిపదికన ఎంపికా?

షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ప్రతి మండలం నుంచీ 83.33 శాతం ఉత్తీర్ణత, ఆపైన సాధించిన విద్యార్థులను ఆరుగురు చొప్పున ఎంపిక చేయాలని నిర్ణయించారు. వారిలో ఓసీ 2, బీసీ 2 ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు చొప్పున సామాజిక వర్గాల ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఇలా సామాజిక వర్గాల ప్రాతిపదికన కాకుండా, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని (రేషన్‌ కార్డు కలిగిన) ఎంపిక చేసి ఉంటే మరింత బాగుండేదని అంటున్నారు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మాత్రమే వర్తింపజేసి ఉండాల్సిందనే వాదన వినిపిస్తోంది. అలా కాకుండా ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలను ఒకే తాటి పైకి తీసుకురావడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవువుతోంది. వచ్చే ఏడాది నుంచైనా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రతిభ ప్రాతిపదికగా మాత్రమే షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపిక చేయాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement