బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలి

Jun 21 2025 3:59 AM | Updated on Jun 21 2025 3:59 AM

బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలి

బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలి

లేదంటే

రాజమహేంద్రవరంలో తిరగలేరు

మాజీ సీఎం జగన్‌పై

అనుచిత వ్యాఖ్యలు సబబు కాదు

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

కోరుకొండ: తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పట్టుకుని నరుకుతామంటూ రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోరు పారేసుకోవడం దుర్మార్గమని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. చేసిన తప్పుడు వ్యాఖ్యలకు బుచ్చయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోరుకొండ మండలం కణుపూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన బుచ్చయ్యను మహిళలు తరిమేసిన ఘటనను గుర్తు చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెచ్చరిల్లుతున్న హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలో దయనీయమైన స్థితిలోకి జారిపోయిందన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దాడులు, కేసులు, అరెస్టులతో భౌతికంగా వేధిస్తోందని ధ్వజమెత్తారు. మూడు పార్టీలు కలసి గెలవడం పెద్ద విషయం కాదన్నారు. వైఎస్సార్‌ సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, జగన్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదనే విషయాన్ని చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం ప్రజలను భయపెట్టే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్‌ పర్యటనలకు తరలి వస్తున్న జనసమూహాన్ని టీడీపీ నాయకులు ఆపలేరన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు చంద్రబాబు ఆలోచనా విధానాన్నే కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు అనుసరించడం శోచనీయమన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేగా చెప్పుకొంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంగితజ్ఞానం మరచి, మాజీ సీఎం జగన్‌పై అన్న తప్పుడు మాటలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాజమహేంద్రవరంలో తిరగలేరని రాజా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement