
మట్టి.. మళ్లీ జారిపోయేట్టు..
● రూ.లక్షలతో పూడికల తొలగింపు
● తవ్విన మట్టి గట్టు పైనే వేస్తున్న వైనం
● వాన కురిస్తే తిరిగి కాలువలోకి
జారిపోయే దుస్థితి
● అదే జరిగితే ప్రజాధనం వృథాయే..
పెరవలి: క్లోజర్ పనుల్లో భాగంగా చేపట్టిన కాలువల పూడికతీత పనులు సక్రమంగా జరగడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కాలువల్లో తవ్విన మట్టిని అక్కడే గట్టుపై వేస్తున్నారు. దీంతో, వర్షాలు కురిస్తే ఆ మట్టి, చెత్త మళ్లీ కాలువలోకి జారిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. పనులు ఇలా చేస్తే ఫలితమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు గత ఏప్రిల్ 27 నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. అనంతరం క్లోజర్ పనుల్లో భాగంగా పంట కాలువల్లో పూడిక తీత, ఇతర పనులు ప్రారంభించారు. ఈవిధంగా పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లోని పలు కాలువల్లో రూ.46.3 లక్షలతో పూడికల తొలగింపు పనులు చేపట్టారు. పెరవలి మండలంలో పేకేరు కాలువ తవ్వకాలకు రూ.6.75 లక్షలు, ముక్కామల చానల్కు రూ.4.52 లక్షలు, గరప కాలువ పనులకు రూ.5.03 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. మొదట ముక్కామల చానల్, తరువాత పేకేరు చానల్ అనంతరం ప్రస్తుతం గరప కాలువ పనులు చేస్తున్నారు. ఈ కాలువల ద్వారా ఒక్క పెరవలి మండలంలోనే 3,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అలాగే, ఉండ్రాజవరం మండలంలో రూ.30 లక్షలతో క్లోజర్ పనులు చేపట్టారు. తీపర్రు, వెలగదుర్రు, అజ్జరం చానళ్ల పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉండ్రాజవరం చానల్ పనులు శివారులో జరుగుతున్నాయి. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ కాలువల్లో తొలగిస్తున్న పూడికలను ఎక్కడికక్కడ గట్లపై వేసి వదిలేస్తున్నారు. దీనివలన భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ మట్టి తిరిగి అదే కాలువలోకి జారిపోయి, మళ్లీ పూడికలు పెరిగిపోతాయని, పైగా చేసిన ఖర్చు కూడా వృథా అని రైతులు చెబుతున్నారు. అలా కాకుండా తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి తరలించి, గట్లు బలహీనంగా ఉన్నచోట్ల వేసి, పటిష్టపరిస్తే మేలని సూచిస్తున్నారు.
కంటితుడుపు పనులే..
నిజానికి క్లోజర్ పనులు ముందస్తుగానే చేపట్టి ఉండాల్సిందని రైతులు అంటున్నారు. కాటన్ బ్యారేజీ నుంచి కాలువలకు నీటి విడుదలను ఏప్రిల్ 27 నుంచి నిలిపివేశారు. అప్పటి నుంచి కాలువలకు తిరిగి నీరు విడుదల చేసేలోగా క్లోజర్ పనులు పూర్తి చేయాలి. కానీ, నీరు విడుదల చేసిన తర్వాత కూడా ఈ పనులు కొనసాగుతున్నాయి. డెల్టా ప్రధాన కాలువలకు ఈ నెల 1 నుంచి నీరు విడుదల చేస్తున్నారు. ఇది జరిగి 20 రోజులైనప్పటికీ ఇంకా పంట కాలువల్లో పూడికలు తొలగించే పనులు చేయడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అది కూడా నిధులు అంతంత మాత్రంగానే విడుదల చేశారనే విమర్శ వస్తోంది. రైతులపై ప్రేమ ఉంటే క్లోజర్ పనులకు ప్రభుత్వం ముందుగానే అనుమతులు, తగినన్ని నిధులు ఇచ్చి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కాలువలకు నీటిని విడుదల చేస్తూండటంతో పనులు హడావుడిగా మమ అనిపించేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏటా కాలువలకు నీరు వచ్చే సమయానికి రైతులు చేలను దుక్కులు చేసి, ఆకుమడులు సిద్ధం చేసుకునేవారు. కానీ, ఈసారి క్లోజర్ పనుల కారణంగా పంట కాలువలకు నీరు వదలకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఖరీఫ్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మట్టి.. మళ్లీ జారిపోయేట్టు..

మట్టి.. మళ్లీ జారిపోయేట్టు..