
అక్రమ డ్రెడ్జింగ్తో ఇసుక దోపిడీ
తాళ్లపూడి (కొవ్వూరు): ఉచిత ఇసుక ముసుగులో కూటమి నాయకులు జేబులు నింపుకొంటున్నారని, దీనికోసం గోదావరి నదిలో అక్రమంగా డ్రెడ్జింగ్ చేస్తున్నా పట్టించుకోవటం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోపించారు. కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లోని ఇసుక ర్యాంపులను శుక్రవారం ఆయన సందర్శించారు. కొవ్వూరు, ఆరికిరేవుల, కుమారదేవం, ప్రక్కిలంక ర్యాంపుల్లో తవ్వకాలు జరిగిన తీరు, ఇసుక స్టాక్ పాయింట్లు, అధికారులు ఇటీవల పట్టుకున్న డ్రెడ్జింగ్ పడవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టన్ను ఇసుకను రూ.80కి విక్రయించాల్సి ఉండగా అధిక ధరలకు అమ్ముకుని దోచుకుంటున్నారని అన్నారు. ర్యాంపుల్లో తవ్వుతున్న ఇసుకకు లెక్కా పత్రం లేదన్నారు. నియోజకవర్గంలో దాదాపు 25 డ్రెడ్జింగ్ పడవలను పట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారని, అయినప్పటికీ డ్రెడ్జింగ్ ఎక్కడా ఆగడం లేదని చెప్పారు. ఇప్పుడు తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు పట్టుకున్న బోట్లను బయటకు పంపించకుండా ఇంకా గోదావరి నదిలోనే ఉంచడమంటే రీచ్ నిర్వాహకులు, టీడీపీ నాయకుల అక్రమ తవ్వకాలను ప్రోత్సహించడం కాదా అని వెంకటరావు ప్రశ్నించారు. ర్యాంపుల్లో కూలి కోసం వచ్చిన పడవలపై కేసులు పెట్టడమేమిటని, వాటిని వినియోగించడానికి రప్పించిన ర్యాంపుల నిర్వాహకులపై కేసులెందుకు పెట్టలేదని నిలదీశారు. ఇసుక స్టాక్ పెట్టుకుని, కొరత సృష్టించి, ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి స్టాక్ పాయింట్లకు వచ్చే వాహనాలతో ప్రజలు గోదావరి గట్టుపై ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, వాటిని సంక్షేమ పథకాలకు కేటాయించారని, నేడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. బోట్స్మెన్ సొసైటీ రీచ్లలో కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి వంతెనల వద్ద ఇసుక తవ్వేస్తున్నారని వెంకటరావు అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జొన్నకూటి పోశిరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొలిశెట్టి నాగేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంటమని రమేష్, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తోట రామకృష్ణ, గూడా విజయరాజు, నామా ప్రకాశం, పిట్టా శ్రీనివాస్, నూతంగా సురేష్, గండి రాంబాబు, తిగిరిపల్లి వెంకట్రావు, బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, వి.నంద, మహేష్, దాకే రాజు, బట్టు సుబ్బారావు, యడల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.