బుచ్చయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బుచ్చయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

Jun 21 2025 3:59 AM | Updated on Jun 21 2025 3:59 AM

బుచ్చ

బుచ్చయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

రాజమహేంద్రవరం రూరల్‌: తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నాయకుడు అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నరుకుతానన్న రాజమహేంద్రవరం రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ ప్రజలు, రైతుల కోసం పోరాడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తున్నారన్నారు. ‘అధికార పార్టీ నాయకులు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదు. పైగా, సీఎం చంద్రబాబు అహంకారంతో వైఎస్‌ జగన్‌ను భూస్థాపితం చేస్తానంటాడు. మరో సీనియర్‌ నేత ఓడిపోయాడు గానీ ఇంకా చావలేదంటాడు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైఎస్‌ జగన్‌ను నరుకుతానంటాడు. ఇటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలను సభ్యసమాజం తీవ్రంగా ఖండించాలి’ అని వేణు అన్నారు. మంచికి అండగా నిలుస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నరుకుతానన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు నమోదు చేసి, చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

యోగాతో రుగ్మతల నివారణ

రాజానగరం: నిరంతర యోగా సాధన ద్వారా అనేక శారీరక, మానసిక రుగ్మతలను అధిగమించవచ్చని, ప్రశాంత జీవనం గడపవచ్చని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కర వనంలో అటవీ శాఖ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ మూర్తి తదితరులు ప్రసంగించారు. అనంతరం, శిక్షకుల పర్యవేక్షణలో విద్యార్థులు, ఉద్యోగులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ్మూర్తి, జిల్లా అటవీ శాఖ అధికారి వి.ప్రభాకరరావు, ఫారెస్టు అకాడమీ సభ్యులు, డీఆర్‌డీఏ పీడీ మూర్తి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పూరీ రథయాత్రకు

ప్రత్యేక బస్సు

రాజమహేంద్రవరం సిటీ: పూరీ జగన్నాథుని రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం జిల్లా నుంచి ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్‌ఎన్‌ మూర్తి శుక్రవారం తెలిపారు. ఈ బస్సు ఈ నెల 25న రాజమహేంద్రవరం నుంచి బయలుదేరుతుందన్నారు. నాలుగు రోజుల పాటు సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, భువనేశ్వర్‌, సాక్షి గోపాల్‌, కోణార్క్‌, పూరీ క్షేత్రాలను దర్శించుకుని తిరిగి వస్తుందన్నారు. వివరాలకు 95023 00189, 73829 12141 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఘనంగా చండీహోమం

అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించారు. ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు ఉపాధ్యాయుల రమేష్‌, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకులు, బాలు, వేణు వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్‌, కూచుమంచి ప్రసాద్‌ తదితరులు హోమం నిర్వహించారు. హోమంలో 25 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యాన, కొండ దిగువన తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి కూడా అర్చకుడు చిట్టెం హరగోపాల్‌ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు.

బుచ్చయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి 1
1/2

బుచ్చయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

బుచ్చయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి 2
2/2

బుచ్చయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement