
విద్యుదాఘాతానికి కార్మికుడి మృతి
దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతవరంలో విద్యుదాఘాతానికి గురై ఆయిల్ పామ్ గెలలను చెట్టు నుంచి దించుతున్న కార్మికుడు తిప్పనబోయిన శ్రీనివాసరావు(35) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం నల్లజర్ల మండలంలోని సుభద్రపాలెంకు చెందిన శ్రీనివాసరావు గురువారం ఉదయం పోతవరం శివారులోని ఒక రైతులకు చెందిన పామ్ ఆయిల్ తోటలో గెలలు కోస్తుండగా అతని చేతిలో ఉన్న ఇనుప ఊస ప్రమాదవశాత్తూ పక్కన గల విద్యుత్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుధారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.