
తాళ్లరేవు: స్థానిక సీహెచ్సీ సూపరింటెండెంట్ ఆర్.స్నేహలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు తాడేపల్లి విజిలెన్స్ విభాగం డీఎస్హెచ్ నుంచి ఉత్తర్వులు ఆస్పత్రికి అందాయి. ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి రెండో కాన్పుగా జన్మించిన పసికందు మృతి చెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ స్నేహలత, స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని, వారిని విధుల నుంచి తొలగించాలని కోరుతూ ధర్నా చేశారు.
ఈ నేపథ్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆందోళనకారులతో మాట్లాడి, విచారణ నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా అదేరోజు బాధ్యులైన నర్సులను సస్పెండ్ చేయగా, సూపరింటెండెంట్ స్నేహలతను సోమవారం సస్పెండ్ చేశారు. ప్రసవానికి ముందు కేసును సరిగ్గా అనుసరించకపోవడం, రోగికి జ్వరం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, అటెండర్ల కాల్కు వెంటనే స్పందించకపోవడం, కేసు షీట్ను ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేయడం, విధుల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.