ఇంటర్‌ తరువాత కోర్సుల ఎంపికే కీలకం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ తరువాత కోర్సుల ఎంపికే కీలకం

Jun 17 2025 5:07 AM | Updated on Jun 17 2025 5:07 AM

ఇంటర్

ఇంటర్‌ తరువాత కోర్సుల ఎంపికే కీలకం

మూడు, నాలుగేళ్లు కష్టపడితే

ఆనందమయ జీవితం

సంప్రదాయ డిగ్రీ కోర్సులతోనూ ఉపాధి

రాయవరం: ఇంటర్‌ తర్వాత ఏ కోర్సు చదవాలి! ఏ రంగంలో స్థిరపడాలనే సందేహాలు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తుంటాయి. తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకోకుండా విద్యార్థులు ఇష్టమైన కోర్సును ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలో 9,246 మంది ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 1,576 మంది ఉత్తీర్ణత సాధించారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన మరో ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందారు. వీరిలో 70 శాతం మేరకు ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతున్నట్టు అంచనా. ఇంటర్‌ తరువాత అందుబాటులో ఉన్న కోర్సులు ఇవీ..

వైద్య విద్య

ఇంటర్లో బైపీసీ చదివేవారు వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశముంది. నీట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్‌ సీటు లభిస్తుంది. వైద్య విద్య పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. బీడీఎస్‌ పూర్తి చేసి దంత వైద్యులుగా స్థిరపడవచ్చు.

సీఏతో

సీఏ (చార్టర్‌ అకౌంటింగ్‌) మంచి ఉపాధినిచ్చే కోర్సు. ఇంటర్‌ తరువాత సీపీటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించి, ఐపీసీఏలో చేరవచ్చు. ఇది నాలుగున్నర సంవత్సరాల కోర్సు.

కామర్స్‌ కోర్సులు

బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ను బీకామ్‌ ఆనర్స్‌ అని కూడా పిలుస్తారు. ఇంంటర్‌లో కామర్స్‌ చదివిన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో బీకామ్‌ ప్రవేశానికి సీయుఈటీ పరీక్షను రాయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్‌, బీమా రంగాల్లో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు బీకామ్‌ అకౌంటింగ్‌, టాక్సేషన్‌ తీసుకోవాలి. బీకామ్‌ కోర్సు పాఠ్యాంశాల్లో ఇండియన్‌ టాక్స్‌ సిస్టమ్‌, ఫైనాన్సియల్‌ అకౌంటింగ్‌, వాల్యూయాడెడ్‌ టాక్స్‌, సెంట్రల్‌ టాక్స్‌ ప్రొసీజర్‌, ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ కమ్యూనికేషన్‌ ఉంటాయి. బీబీఏ, బీసీఏ, సీఏ, సీఎస్‌ తదితర వృత్తిపరమైన కోర్సులను చదవడానికి వీలుంది.

డిగ్రీతో బోలెడు అవకాశాలు

సీయూ సెట్‌ రాసి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం గల విశ్వవిద్యాలయాల్లో హ్యూమన్‌ సైన్సు కోర్సులు చదవచ్చు. మన రాష్ట్రంలో బీఏతో పాటు బీకాం జనరల్‌, కంప్యూటర్‌ కోర్సులకు డిమాండ్‌ ఉంది. బీఎస్సీ కంప్యూటర్‌ కోర్సుకు కూడా డిమాండ్‌ ఉంది.

డిగ్రీ చదివే విద్యార్థులకు నైపుణ్యాల పెంపుపై వివిధ యూనివర్శిటీలు దృష్టి సారించాయి. ఇప్పుడిప్పుడే క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో డిగ్రీ చదివే విద్యార్థులు కూడా అవకాశాలు పొందుతున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలనుకునేవారు డీఈడీ పూర్తి చేసి అవకాశాలు పొందవచ్చు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఐదేళ్ల కోర్సులకు చెందిన ప్రవేశ పరీక్షలు రాసి ఇంటర్‌ తరువాత న్యాయ విద్యను అభ్యసించవచ్చు.

ఫార్మసీకి ప్రాధాన్యముంది

ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఫార్మసీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. ఏపీ ఈఏపీసెట్‌తో బి–ఫార్మసీ ప్రవేశాలు జరుగుతాయి. ఇది పూర్తి చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, హాస్సిటల్‌ ఫార్మాసిస్టులుగా ఉద్యోగాలు లభిస్తాయి.

వ్యవసాయం, ఉద్యానం

ఏపీ ఈఏపీసెట్‌తోనే బీఎస్సీ అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ చదివే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాల ఈ కోర్సులు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి.

నర్సింగ్‌తో స్వయం ఉపాధి

ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు నర్సింగ్‌ చక్కని అవకాశం. ఈ కోర్సుతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్‌ తరువాత నాలుగేళ్ల కోర్సును ఎంపిక చేసుకుంటే మహిళలకు మంచి అవకాశాలు ఉంటాయి. రెండేళ్ల ఫిజియోథెరపీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫైన్‌ ఆర్ట్స్‌తో ఉజ్వల భవిత

పెయింటింగ్‌, శిల్పకళ, ప్రింట్‌ మేకింగ్‌, విజువల్‌ కమ్యూనికేషన్‌, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్‌ డిజైన్‌, ఆర్ట్‌ హిస్టరీ వంటి విభాగాల్లో శిక్షణ పొందడానికి ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు ఉపకరిస్తాయి. ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ లేదా డిప్లమా పూర్తి చేసిన అనంతరం విద్యార్థులు గ్యాలరీలు, మ్యూజియం, మీడియా సంస్థలు, విద్యారంగం తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది.

డిగ్రీ కోర్సులతో ఉపాధి

ఇంటర్‌ తర్వాత డిగ్రీ కోర్సులతో ఉపాధి పొందడానికి వీలుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎంప్లాయిబిలిటీ కోర్సులు ప్రవేశ పెట్టారు. వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటుగా, ఆక్వా కల్చర్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌ కోర్సులను కలిపి డిగ్రీ చేసుకునే వెసులుబాటు ఉంది.

– డాక్టర్‌ సీహెచ్‌ రామకృష్ణ, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం

ఇంజినీరింగ్‌

జేఈఈ మెయిన్స్‌ అడ్వాన్స్‌డ్‌, ఏపీ ఈఏపీసెట్లో ఇంజినీరింగ్‌ కోర్సులకు ప్రాధాన్యం అధికం. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈ, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఈఈఈ, ఏఐ, ఐటీ తదితర కోర్సులు ఉన్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీలో చేరి ఇంజినీరింగ్‌ చేస్తే డిగ్రీ పూర్తయ్యేలోగా వివిధ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి క్యాంపస్‌ ఇంటర్వూల్లో ఆఫర్లు వస్తున్నాయి.

ఇంటర్‌ తరువాత కోర్సుల ఎంపికే కీలకం1
1/1

ఇంటర్‌ తరువాత కోర్సుల ఎంపికే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement