
గోదావరిలో స్నానానికి దిగిన యువకుడి మృతి
● రెండో రోజు ఒడ్డున మృతదేహం లభ్యం
● కలసి వెళ్లిన మిగిలిన ఆరుగురు మిత్రులు సురక్షితం
కరప/ఐ పోలవరం: ఆదివారం సరదాగా గడపడానికి వెళ్లిన ఏడుగురు స్నేహితులు గోదావరిలోకి స్నానానికి దిగగా, ఒక యువకుడు గల్లంతు అయ్యాడు. మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండో రోజు సోమవారం గోదావరి ఒడ్డున మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కరప గ్రామానికి చెందిన నరాల సాయికృష్ణ(19) మరో ఆరుగురు స్నేహితులతో కల్సి ఆదివారం సరదాగా గడపడానికి మోటార్ సైకిళ్లపై యానాం వెళ్లి, అక్కడి నుంచి ఎదుర్లంక వంతెన దాటివెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఒకరికొకరు సాయపడి ఒడ్డుకు చేరడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వీరిలో సాయికృష్ణ గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడి, ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగురిని ఐ.పోలవరం పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. గల్లంతైన సాయికృష్ణ మృతదేహం రెండో రోజు సోమవారం ముమ్మిడివరం సమీపంలో గోదావరిలో మునిగిపోయిన ప్రాంతంలోనే పైకి తేలింది. రెండురోజులుగా తాత నరాల కృష్ణ(వెంటూరు కృష్ణ), తండ్రి నరాల బుజ్జి, బంధువులతో కల్సి కన్నీరు,మున్నీరుగా విలపిస్తూ గోదావరి ఒడ్డునే ఉండిపోయారు. ఎలాగైనా బతికిబయట పడతాడని ఎదురుచూశారు. తీరా శవమై తేలడంతో తాత, తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటికి వెళ్లి తన కూతురికి ఎలా చెప్పాలంటూ తాత కృష్ణ, తండ్రి బుజ్జి గుండెలు అవిసేలా విలపిస్తూ, కూలబడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కరప మండల యూత్ అధ్యక్షుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పెంకే సత్తిబాబు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఘటనా స్థలానికెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పారు.
గోదావరిలో గల్లంతైన సాయికృష్ణ స్వగ్రామం కరప
గోదావరిలో గల్లంతైన యువకుడు నరాల సాయికృష్ణ స్వగ్రామం కరప. అతని తండ్రి బుజ్జి చిన్న హోటల్ నిర్వహిస్తాడు. తాత నరాల కృష్ణ భార్య కరప హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తుంటారు. తల్లి గృహిణి. వీరికి ఒక కుమారుడు సాయికృష్ణ ఇంటర్మీడియెట్ చదివాడు. కుమార్తె కరప హైస్కూలులో చదువుతోంది. కరప, శివారు రామకంచిరాజునగర్ కాలనీకి చెందిన ఆరుగురు స్నేహితులతో కల్సి యానాం మీదుగా వంతెన దాటి వెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఐ.పోలవరం ఎస్ఐ రవీంద్రబాబు పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాల గాలింపులో సోమవారం సాయంత్రం సాయికృష్ణ మృతదేహం లభ్యమైంది.
కరపలో విషాద ఛాయలు
సాయికృష్ణ మృతితో కరపలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరినీ నవ్విస్తూ, కలుపుగోలుతనంగా ఉండే సాయికృష్ణ లేడని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లికి మరణవార్త తెలియనివ్వలేదు.

గోదావరిలో స్నానానికి దిగిన యువకుడి మృతి