
జాతీయ ఎస్టీ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జాతీయ ఎస్టీ కమిషన్ 2018లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారు అయినాపురపు సూర్య నారాయణ విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో 53శాతం మంది గిరిజనులున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం, అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.11.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. కొత్త భూసేకరణ చట్టం రూల్ 24 ప్రకారం భూమిలేని ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఎకరం భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు సరైన న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో నెసిక లక్ష్మణరావు, బూరమ్మ, వీరమ్మ, రాజమణి పాల్గొన్నారు.