
రీ స్ట్రక్చర్ లెక్క తేలేనా?
రాయవరం: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా ఉంది విద్యాశాఖ పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన 117 జీవో ప్రకారం 3, 4, 5 తరగతులను అవకాశం ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ఇవ్వాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ జీఓ తీసుకు వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ జీవోకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆయా తరగతులను తిరిగి పూర్వపు పాఠశాలలకు పంపించేందుకు రీ స్ట్రక్చర్ పేరుతో కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది. ఇందులో భాగంగా పాఠశాలలను మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, ఫౌండేషన్ పాఠశాలలుగా విభజించారు. పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనికి విద్యార్థులు కనీసం 60 మంది ఉండాలని నిర్ధారించారు. ఏదైనా గ్రామంలో మోడల్ స్కూల్ లేకుంటే కనీస రోల్ 45గా పరిగణించాలని సూచించారు. దీనికి ఎస్ఎంసీల తీర్మానాలు ఉండాలని ముడిపెట్టడంతో ప్రతి గ్రామంలో ఫౌండేషన్ స్కూల్స్గా మార్చిన పాఠశాలల ఎస్ఎంసీల నుంచి వ్యతిరేకత వచ్చింది. అలాగే రీ స్ట్రక్చర్ ప్రాతిపదికన 1, 2 తరగతులున్న ఫౌండేషన్ స్కూళ్లలో 1:30 నిష్పత్తి, బేసిక్ ప్రైమరీలో 1:20, మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కనీసం ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఉన్నత పాఠశాలల్లో సెక్షన్లను పరిగణలోనికి తీసుకుని, ఉపాధ్యాయుల సంఖ్యను నిర్దారించారు. ఈ నిష్పత్తి ప్రకారం ఎంఈఓలు క్యాడర్ స్ట్రెంగ్త్ను, అదే సమయంలో వేకెన్సీ పొజిషన్ను లెక్క తేల్చే పనిలో పడ్డారు.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన
జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ తదితర అంశాలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగానే చేపడుతున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్యాడర్స్ట్రెంగ్త్, క్యాడర్ వారీగా ఖాళీల సంఖ్యను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు అయినప్పటికీ లెక్క తేల్చాలని అధికారులు ఆదేశించడంతో శనివారం నాటికి వాటిని సిద్ధం చేసేలా ఎంఈవోలు, సాంకేతిక సిబ్బంది కుస్తీ పడుతున్నారు.
● అధికారుల ఆదేశాలతో ఎంఈఓలు బిజీ
● వేకెన్సీ పొజిషన్, క్యాడర్ స్ట్రెంగ్త్పై కసరత్తు