జీడీఎస్ జాతీయ మాజీ అధ్యక్షుడు బీవీ రావు
కొత్తపేట : తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగులందరికీ నెలవారీ పింఛను సౌకర్యం కల్పించాలని జీడీఎస్ యూనియన్ జాతీయ మాజీ అధ్యక్షుడు బీవీ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమలాపురం డివిజన్ జీడీఎస్ ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశం ఆదివారం కొత్తపేట సబ్ పోస్టాఫీసు సమీపంలోని ఆర్ అండ్ బీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. యూనియన్ కొత్తపేట బ్రాంచ్ అధ్యక్షుడు వీ సూర్యరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రూ.1.50 లక్షల గ్రాట్యుటీని రూ.5 లక్షలకు పెంచాలని, జీడీఎస్ ఉద్యోగులందరికీ 8 గంటల పనిదినాన్ని కేటాయించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏటా ఒకే రకమైన ఇంక్రిమెంట్లు వర్తింపజేయాలని, కమలేష్ చంద్ర కమిటీ సూచించిన పెండింగ్ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం 15 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా వీ సూర్యరాజు, అధ్యక్షునిగా కాశి గోపీచంద్ ఎన్నికయ్యారు. సమావేశంలో అమలాపురం, రాజోలు, కొత్తపేట ప్రాంతాలకు చెందిన జీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.


