ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు
అమలాపురం టౌన్: ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకునేందుకు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి, తమ అనుమతి లేకుండా యూ డైస్ నుంచి పేర్లను తొలగించడం అన్యాయమని డీఈఓ పి.నాగేశ్వరరావుకు అమలాపురం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందించారు.
అమలాపురంలో డీఈఓను ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు శనివారం కలసి తమ సమస్యలను చెప్పుకొని వినతిపత్రం అందజేశారు. ఈ వివరాలను అమలాపురానికి చెందిన డివిజన్ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అసోసియేషన్ కార్యదర్శి ఎన్.రమేష్ వివరించారు. 2021లో కోర్టు, విద్యా శాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఈ విధంగా పేర్లను తొలగించకూడదన్న ఆంక్షలు ఉన్నాయని కరస్పాండెంట్లు గుర్తు చేశారు. ఆ ఆదేశాలు తుంగలో తొక్కడం సరికాదని స్పష్టం చేశారు. ఇది సైబర్ నేరం కిందకు వస్తుందని వారు డీఈఓకు వివరించారు. దీనిపై డీఈఓ స్పందించి ప్రైవేట్ పాఠశాలల అనుమతి లేకుండా యూ డైస్ నుంచి పేర్లు తొలగించకుండా ఆదేశాల ఇస్తానని చెప్పారని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పి.లక్ష్మీ శ్రీనివాసన్ తెలిపారు. అసోసియేషన్ కార్యదర్శి ఎన్.రమేష్, రాష్ట్ర అసోసియేషన్ నాయకుడు సరిపల్లి సిద్ధార్థ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


