అమలాపురం రూరల్: సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం అమరావతి నుంచి జలవనరుల శాఖ ఉన్నత కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జలధార– జల హారతి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. అమలాపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట కాలువల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులు సమగ్రంగా చేపట్టాలన్నారు. జిల్లాలో 2,135 పనులకు ప్రతిపాదించగా 2,068 పనులు మంజూరయ్యాయన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల్లో ప్రధానంగా ఇంటి నుంచే పనిచేసే విధంగా కౌశలం సర్వేను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. దీనికి 6,040 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఫ ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకూ జరిగే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన మొత్తం 14,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు.


