రావులపాలెం: తన ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో గోదావరి డెల్టాకు జీవం పోసిన మహానీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం రావులపాలెం వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయం, రైతుల అభ్యున్నతికి కాటన్ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నాడు కాటన్ కృషి చేశారన్నారు. ఆయన దూరదృష్టి వల్లే గోదావరి డెల్టా ప్రాంతం సస్యశ్యామలం అయిందని పేర్కొన్నారు. రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, పార్టీ మండల కన్వీనర్ బొక్కా కరుణాకరం, మాజీ వార్డు సభ్యుడు సఖినేటి వాకులరాజు, వత్సవాయి కృష్ణంరాజు, జొన్నాడ దొరబాబు పాల్గొన్నారు.


