అమలాపురం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం కంటే ఈ ఏడాది 10 శాతం పిల్లల నమోదు పెంచాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఉపాధ్యాయులను గురువారం ఆదేశించారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా రాష్ట్ర పరిశీలకులు రమ్యశ్రీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు రావులపాలెంలో సమీక్షా సమావేశం నిర్వహించి ఎన్రోల్మెంట్ శాతం పెంపుపై దిశా నిర్దేశం చేశారన్నారు. ప్రతి చిన్నారి బడిలోకి, ప్రతి కుటుంబంలో విద్యా చైతన్యమే లక్ష్యంగా బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగు తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ను జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. బడి ఈడు పిల్లలందరినీ గుర్తించి, వారిని వంద శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తీసుకోవాలన్నారు. డిజిటల్ విద్య, ఐఎఫ్పీ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ద్వారా నాణ్యమైన డిజిటల్ బోధన అందుతోందన్నారు. ఈ సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు కరపత్రాల ద్వారా వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించలేక పోయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులను సమర్థంగా నిర్వహించాలన్నారు.
5 నుంచి ఎన్నికల జాబితా సమగ్ర సవరణ
జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతుందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ జ్ఞానేశ్కుమార్, ఇతర అధికారులు ఢిల్లీ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి త్వరలో నిర్వహించనున్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి బూత్ లెవల్ అధికారులు ఇంటింటి తనిఖీలు, ప్రత్యేక శిబిరాలు, ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనలో చురుకై న పాత్ర పోషించాలని ఆదేశించారు. అనంతరం జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారన్నారు. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారన్నారు. సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు. అర్హు లైన కొత్త యువ ఓటర్లను చేర్చడం, చనిపోయినవారు లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టారన్నారు. ప్రస్తుతం జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకొని 18 ఏళ్లు నిండిన వారిని జాబితాలో చేర్చుతారన్నారు. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి లేదా కొత్తగా నమోదు చేసుకోవ డానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉపయోగించ వచ్చునన్నారు. ఉప తహసీల్దార్ శివరాజ్ పాల్గొన్నారు.


