‘‘అప్సడాకు కనీస సమాచారం లేకుండా.. కంపెనీలు ఇష్టానుసారం మేత ధరలు పెంచారంటే వారికి ప్రభుత్వ దన్ను ఉండడమే కారణం’ అని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఆక్వా రైతులను ఆదుకుంటామని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారిని అన్నిరకాలుగాను మోసం చేసిందని మండిపడ్డారు. అమలాపురంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వనామీ రొయ్యల సీడ్, ఫీడ్ అమ్మేవారు, రొయ్యలు కొనుగోలు చేసేవారు కోట్ల రూపాయల లాభాలు చూస్తుంటే పంట సాగు చేస్తున్న రైతులు మాత్రమే నష్టపోతున్నారన్నారు. రెండు పంటలు పోయినా కనీసం ఒక్క పంట చేతికి వచ్చినా ఎంతో కొంత లాభాలు చూడవచ్చని ఆశతో సాగు చేస్తుంటే రైతుల మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తున్నవారు నిలువునా దోపిడీ చేయడం అన్యాయమన్నారు. విదేశీ మారకద్రవ్యం అందించే వనామీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలని బాబి హితవు పలికారు.
– జిన్నూరి రామారావు (బాబి)


