కొత్తపేట: ఆక్వా ఫీడ్ ధరలు అధికంగా పెంచడం, ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేయడం వంటి అంశాలకు సంబంధించి రైతుల తరఫున వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అమలాపురం హైస్కూల్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద గురువారం ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆక్వా రంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను టన్నుకు రూ.10,530 వరకు పెంచడంతో రైతులు అయోమయ పరిస్థితులకు లోనయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ధరల పెంపు వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. రబీ వరి కొనుగోలులో ప్రభుత్వం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


