కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తన ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును తిరిగి ఆమెకు అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆటో డ్రైవర్. కోటగుమ్మం సెంటర్ వద్ద ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న మహిళ క్వారీ సెంటర్ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్లో దిగింది. అనంతరం, ఆమె తన పర్సును ఆటోలో మరచిపోయినట్టు గుర్తించింది. ఆ ఆటో చుట్టుపక్కల ఉందేమోనని వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆమె త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ మహిళ పర్సు మరచిపోయిందంటూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు అప్పగించాడు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాలతో సరిపోల్చిన పోలీసులు.. ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయతీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ను త్రీటౌన్ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు, సిబ్బంది అభినందించారు.


