‘సహకార’ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ
రామచంద్రపురం రూరల్: న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న సహకార సంఘాల ఉద్యోగులను నమ్మించి హామీ ఇచ్చిన ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన జీఓతో దగా చేసిందని రాష్ట్ర ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ కోశాధికారి పెంకే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 రోజుల పాటు వివిధ దశలలో సమ్మె చేయగా సంబంధిత మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్వయంగా వచ్చి తమ నాయకులతో చర్చించి ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదన్నారు. జీఓ 322తో ఉద్యోగులకు ఒరిగేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. జీఓ 36 ప్రకారం 2019 నుంచి 40 శాతం పెంపుదల కోరితే ప్రభుత్వం గత జీఓలను పక్కన పెట్టి తాజా జీఓలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 20 శాతం వేతన పెంపుదల పూర్తి జీతంపై కాకుండా బేసిక్ పే పై మాత్రమే వర్తింపజేయడం దుర్మార్గమన్నారు. 2019 తరువాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులు సహకార సంఘాల కంప్యూటరీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తే ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో వారిని కనీసం పరిగణనలోనికి తీసుకోకపోవడం దారుణమన్నారు.


