● హానికరమైన వ్యర్థాలను
బూడిదగా మార్చే సాంకేతికత
● అమలాపురంలో ట్రయల్ రన్
● పరిశీలించిన కలెక్టర్ మహేష్కుమార్
అమలాపురం టౌన్: ప్లాస్మా టెక్నాలజీ ద్వారా హానికరమైన వ్యర్థాలను బూడిదగా మార్చడం ఆధునికంగా పర్యావరణ హితమైన పద్ధతి అని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. అమలాపురం మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ వద్ద రూ.5 కోట్లతో నిర్మించిన ప్లాస్మా టెక్నాలజీ యూనిట్కు ట్రయల్ రన్ బుధవారం నిర్వహించిన క్రమంలో ఆ యూనిట్ను కలెక్టర్ పరిశీలించి ప్రసంగించారు. సాధారణంగా పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటాయని, ప్లాస్మా అనేది నాలుగో రూపమన్నారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వాయువును మండించినప్పుడు అది ప్లాస్మాగా మారుతుందని చెప్పారు. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ద్వారా హానికరమైన వ్యర్థాలను డ్రైవ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసే యూనిట్ను ఇక్కడ నెలకొల్పామన్నారు. తడి,పొడి చెత్తతో పాటు ప్రమాదకరమైన బయో– మెడికల్ వేస్ట్ను కూడా ఈ ప్లాస్మా యూనిట్ రోజుకు 10 టన్నులు ప్రాసెసింగ్ చేసి సురక్షితంగా నాశనం చేస్తుందని తెలిపారు. ఈ టెక్నాలజీ వల్ల చెత్త కుప్పలు ఉండవని, డంపింగ్ యార్డ్ల పేరుతో ఎక్కువ భూమి కూడా అవసరం లేదని వివరించారు. చెత్తను నాశనం చేసిన తర్వాత వచ్చే బూడిదతో గ్యాస్ వస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. చెత్త సమస్యకు ఇది ఒక శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్కుమార్, తహసీల్దార్ వీఎఎస్ దివాకర్, మున్సిపల్ ఇంజినీర్లు, ప్లాస్మా యూనిట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


