అమలాపురం రూరల్: జిల్లాలో డీజిల్ సరఫరా రాబోయే రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీజిల్ కొరత అంశంపై ముందుగా ఏపీ ఈపీడీసీఎల్, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమీక్షలో ఆక్వారంగ ఏరియేటర్లకు, వ్యవసాయ కోతలకు, రోజువారి డీజిల్ వినియోగంపై లక్ష్యాలు నిర్దేశించారు.ఈ సమీక్షలో గత మూడు రోజులుగా సరఫరాలో కొద్దిపాటి అంతరాయాలు మూలంగా ఆక్వా రంగ ఏరియేటర్లకు గాను డీజిల్ వినియోగం పెరిగిందని ప్రస్తుతం విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగడంతో ఆక్వా రంగంలో డీజిల్ వినియోగం ప్రస్తుతం తగ్గుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ముమ్మరంగా యంత్రాలతో వరి కోతలు నిర్వహిస్తున్నారని వీటికి డీజిల్ కోసం సచివాలయ వ్యవసాయ సహాయకులు కూపన్లను రోజువారి వారి సంతకంతో ధ్రువీకరించి పంపుతారని వాటికి ఆయిల్క్యాన్లలో ఆయిల్ నింపి సరఫరా చేయాలని బంకు ప్రతినిధులకు పంపుతారని ఆ మేరకు డీజిల్ సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో పంట కాలువలు మూసివేసిన తర్వాత చేపట్టే పూడికతీత పనుల మట్టిని ప్రభుత్వ పాఠశాలు, బరియల్ గ్రౌండ్స్ పల్లపు ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు మండలాల వారీగా జలవనరులు, జిల్లా పంచాయతీ, గనుల శాఖ, డిప్యూటీ ఎంపీడీవో, డ్వామా సిబ్బందితో కమిటీలు వేయాలని కలెక్టర్ ఆదేశించారు.


