దొంగనోట్ల కేసులో ముగ్గురి అరెస్టు
రూ.1,45,500 నకిలీ కరెన్సీ స్వాధీనం
తాళ్లపూడి: దొంగనోట్లు తరలిస్తున్న ముగ్గురిని కొవ్వూరు పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.1,45,500 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద శుక్రవారం వారిని పట్టుకున్నారు. కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి తెలిపిన వివరాల మేరకు ఈ కేసులో మొత్తం ఐదుగురిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో గోపాలపురానికి చెందిన శేఖర్, జంగారెడ్డిగూడేనికి చెందిన లాగు శ్రీను, చాగల్లుకు చెందిన బొలిపో తేజ ఉన్నారు. వారిని విచారించి రూ.1,45,500 విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లు ఆన్లైన్ ద్వారా వారికి అందుతున్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గోపాలపురం మండలంలోని కరకపాడుకు చెందిన జక్కు శివాజీకి ఇది వరకు జైలు పరిచయమైన ఏలేటి చంద్రశేఖర్, లాగు శ్రీను, ముగ్గురు వ్యక్తులు రూపాయికి ఏడు రూపాయలు దొంగ నోట్లు ఇస్తానని చెప్పాడు. దీంతో కొవ్వూరు మండలం కాపవరం తిరుమల స్కూల్ వద్దకు రమ్మని చెప్పగా ఫిర్యాదీ అక్కడకు వెళ్లగా అతడి నుంచి రూ. 1.50 తీసుకొని రూ.15 లక్షల దొంగ నోట్లు ఇచ్చి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. తరువాత చూసుకోగా సదరు నోట్లపై చైల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.శ్రీహరిరావు కేసు నమోదు చేశారు. సీఐ కె.విజయబాబు, డీఎస్పీ జి.దేవకుమార్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.


