సిరుల సీమలో మందుపాతర | - | Sakshi
Sakshi News home page

సిరుల సీమలో మందుపాతర

Jun 27 2025 4:16 AM | Updated on Jun 27 2025 4:16 AM

సిరుల

సిరుల సీమలో మందుపాతర

నిక్షేపాల వెతికితీత ప్రారంభం నుంచే ప్రమాదాలు

● 1990లో కొమరాడ ఆయిల్‌ బావి బ్లో అవుట్‌.

● 1994లో అమలాపురం వద్ద

బోడసకుర్రు బ్లో అవుట్‌ .

● 1995లో కొత్తపేట మండలం దేవరపల్లి బ్లోఅవుట్‌

● 2011లో రాజోలు మండలం కడలిలో పొన్నమండ నుంచి తాటిపాకకు వెళ్లే గెయిల్‌ పైప్‌లైన్‌ పేలుడు.

● 2012లో రాజోలు మండలంలో కాట్రేనిపాడులంక బావి బ్లో అవుట్‌ కొద్దిపాటిలో తప్పింది. (రాత్రంతా కష్టపడి అరికట్టారు.)

● 2014లో నగరం గెయిల్‌ పైప్‌లైన్‌ విస్ఫోటం.

● 2014లో గొల్లపాలెం – కరవాకలో త్రుటిలో తప్పిన బ్లో అవుట్‌.

● 2015లో కేశవదాసుపాలెం జీసీఎస్‌లో ఆయిల్‌ పైప్‌లైన్‌ పేలుడు.

● 2016లో అడవిపాలెం వద్ద నగరం మాదిరి గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలినా నిప్పు అంటుకోక పోవడంతో ఒక కాలనీకి త్రుటిలో తప్పిన ముప్పు.

● గ్రామాల్లో ఏటా రెండు నెలలకోసారి తరచూ గ్యాస్‌ లీకేజీలు.

2014 నగరంలో గెయిల్‌ గ్యాస్‌

ట్రంక్‌ లైన్‌ పేలుడు

బిక్కుబిక్కుమంటూ ప్రజల జీవనం

కేజీ బేసిన్‌లో బతుకు దుర్భరం

నిర్లక్ష్యంగా పైప్‌లైన్లు, ట్రంక్‌లైన్ల నిర్వహణ

బావుల కనెక్టింగ్‌ పాయింట్ల వద్ద లీకేజీలు

నగరం విస్ఫోటానికి 11 ఏళ్లు

మలికిపురం: నగరం ఆయిల్‌ రిఫైనరీ సమీపంలోని నివాస ప్రాంతాల మధ్య 11 ఏళ్ల కిందట సంభవించిన భారీ విస్ఫోటం ఎంతో మంది జీవితాలను కకావికలం చేసింది. నాటి ఘటన నేటికీ వారి కళ్ల ముందు మెదులుతూ, కాళరాత్రిని తలపిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. నాటి దుర్ఘటన ఆయిల్‌, గ్యాస్‌ వ్యాపార సంస్థలకు ఏమాత్రం గుణపాఠం నేర్పలేదని తరచూ సంభవిస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. 2024 జూన్‌ 27 తెల్లవారుజామున సంభవించిన ఈ దుర్ఘటన 20 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఇటువంటి ఘటనలు జరుతాయని ముందే గ్రహించిన కొందరు మేధావులు కేజీ బేసిన్‌కు 40 ఏళ్ల క్రితం పెట్టిన పేరు ‘మందుపాతర’. భూగర్భంలోని చమురు నిక్షేపాలను బయటకు తీస్తున్నామని సగర్వంగా ప్రకటించే ఆయా చమురు సంస్థలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ ఘటనకు ముందూ వెనుకా కూడా అనేక లీకేజీలు, బ్లో అవుట్‌ ఘటనలకు కోనసీమ జిల్లా నిలయమవుతోంది.

సమాచారం బదలాయింపు లేదు

నగరం పేలుడు అనంతరం కేజీ బేసిన్‌లో పైప్‌లైన్ల మార్పులు జరిగాయి. కోనసీమలో ఉప్పునీటి ప్రభావం అధికమైంది. ఈ నేపథ్యంలో పైప్‌లైన్లు దెబ్బ తింటున్నాయనే వాదన ఉంది. కేజీ బేసిన్‌లో గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(గెయిల్‌)కు మొత్తం 900 కిలోమీటర్లు మేర గ్యాస్‌ పైప్‌లైన్లు విస్తరించి ఉన్నాయి. అలాగే కెయిర్న్‌, రిలయన్స్‌ సంస్థలకు చెందిన గ్యాస్‌ పైప్‌లైన్లూ ఉన్నాయి. గెయిల్‌ పైప్‌ లైన్లను కోనసీమతో పాటు ఇక్కడి నుంచి కొవ్వూరు, విజ్జేశ్వరం, వేమగిరి, కాకినాడ, విజయవాడ, కొండపల్లి, హైదరాబాద్‌ వరకూ ఏర్పాటు చేశారు. నగరంలో గెయిల్‌ పైప్‌లైన్‌ పేలుడు అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు పలు సర్వే సంస్థలతో పైప్‌లైన్ల నాణ్యతపై పరిశీలన జరిపించారు. అనంతరం 2014లో ఇచ్చిన నివేదిక ఆధారంగా కేజీ బేసిన్‌లో గెయిల్‌ గ్యాస్‌ పైప్‌లైన్లన్నీ అప్పటికే సుమారు 25 ఏళ్ల క్రితం వేసినవని, వీటిలో సుమారు 700 కిలోమీటర్ల లైన్లు మార్చాలని ఆయా సంస్థలకు సూచించారు. అప్పట్లో దూర ప్రాంతాలకు గ్యాస్‌ సరఫరా చేసే ట్రంక్‌ లైన్ల మార్పు జరిగింది. ఈ పనులు కూడా జరిగి 11 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఈ లైన్ల నాణ్యతపై ఓఎన్‌జీసీ – రెవెన్యూ అధికారుల మధ్య సమాచారం బదలాయింపు లేదు. ప్రమాదం జరిగితే తప్ప వీటిపై దృష్టి పెట్టడం లేదు. పరిశీలన అంతకంటే లేదు.

ఆయిల్‌ పైప్‌లైన్లు కూడా అంతే..

కోనసీమలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు వందకు పైగా గ్యాస్‌ బావుల నుంచి తాటిపాక రిఫైనరీ వద్దకు నాలుగు అంగుళాల పైప్‌లైన్ల ద్వారా ఆయిల్‌ కం గ్యాస్‌ తరలిస్తారు. మరో వంద బావుల నుంచి కేశనపల్లి, అడవిపాలెం, కేశవదాసుపాలెం గ్యాస్‌ కలెక్షన్‌ స్టేషన్ల(జీసీఎస్‌)కు కూడా 4 అంగుళాల పైప్‌ లైన్లతో గ్యాస్‌, ఆయిల్‌ తరలిస్తారు. ఇవి ఓఎన్జీసీ పరిధిలో ఉంటాయి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నివాసాల మధ్య ఉన్నాయి. ఈ లైన్లు సుమారు 5 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. ఇవి కూడా శిథిలమై తరచూ పేలిపోతున్నాయి. అలాగే, బావుల వద్ద కూడా తరచూ లీకేజీలు వెలుగు చూస్తున్నాయి. బావుల్లోకి వేసిన పైప్‌లు, వెల్‌ క్యాప్‌లు శిథిలమయ్యాయి.

పొగమంచు చూసినా భీతిల్లుతున్న ప్రజలు

పొగమంచును చూసినా గ్యాస్‌ అని స్థానికులు భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ఆయిల్‌ బావుల వద్ద, గ్యాస్‌లైన్లు వెళ్లిన ప్రాంతాల్లోనూ పొగమంచు కనపడినా ప్రజలు భయపడిపోతున్నారు. లీకైన గ్యాస్‌ పొగమంచు మాదిరి అలముకోవడమే కారణం. ఇది నిప్పు తగిలితే అంటుకుంటుంది. దీంతో, తెల్లవారుజామున పొయ్యి వెలిగిద్దామన్నా కూడా ఆందోళన చెందాల్సిన దుస్థితి అక్కడి ప్రజలది.

నాణ్యత లోపం కూడా..

పైప్‌లైన్ల నిర్మాణంలో కూడా నాణ్యత లోపం చాలా ఉంటోంది. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పైప్‌లైన్ల నిర్మాణంలో బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఇష్టానుసారం కాంట్రాక్టులు ఇచ్చి, నాణ్యత లేని పైప్‌లైన్లు వేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఓఎన్జీసీ, గెయిల్‌ అంటే ఆడిట్‌ లేని పద్దులు ఉంటాయని, ఇష్టానుసారం దోచుకోవచ్చనే విమర్శ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఈ సంస్థల కాంట్రాక్టు పనులూ జరుగుతున్నాయి.

అడవిపాలెంలో గ్యాస్‌ లీక్‌ (ఫైల్‌)

సిరుల సీమలో మందుపాతర1
1/3

సిరుల సీమలో మందుపాతర

సిరుల సీమలో మందుపాతర2
2/3

సిరుల సీమలో మందుపాతర

సిరుల సీమలో మందుపాతర3
3/3

సిరుల సీమలో మందుపాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement