
భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు
● ఆర్జేసీ త్రినాథరావు
● వాడపల్లి వెంకన్న క్షేత్రం సందర్శన
● క్యూ లైన్లు, శానిటేషన్ పరిశీలన
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో భక్తులు మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుని, అన్న ప్రసాదం స్వీకరించి, నూరు శాతం సంతృప్తి చెందేలా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు దేవదాయ–ధర్మాదాయ శాఖ ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు తెలిపారు. గురువారం ఆయన వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ నల్లం సూర్యచక్రధరరావు క్షేత్రంలో భక్తులకు అమలు చేస్తున్న సౌకర్యాలు, చేయాల్సిన పనులను ఆర్జేసీకి వివరించారు. అనంతరం ఆర్జేసీ విలేకరులతో మాట్లాడుతూ వాడపల్లి, అన్నవరం, సింహాచలం ఆలయాలలో క్యూ లైన్లు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించి, అవసరం మేరకు అభివృద్ధికి చర్యలు తసుకుంటున్నట్టు తెలిపారు. అంతకు ముందు త్రినాథరావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈఓతో పాటు వేదపండితులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు.
రూ.1.45 కోట్ల ఆదాయం
కాగా స్వామివారికి హుండీల ద్వారా రూ.1,45,16,599 ఆదాయం వచ్చినట్టు దేవదాయ–ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం గురువారం వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,22,85,766, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.22,30,833తో మొత్తం రూ. 1,45,16,599 ఆదాయం వచ్చినట్టు వివరించారు. అలాగే బంగారం 37 గ్రాములు, వెండి 890 గ్రాములు, పలు దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని ఈఓ తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా జిల్లా దేవదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, పలివెల ఉమా కొప్పేశ్వరస్వామివారి దేవస్థానం ఈఓ పీవీవీఎస్ కామేశ్వరరావు, గోపాలపురం గ్రూపు దేవాలయాల గ్రేడ్–3 ఈఓ బీ కిరణ్ పాల్గొన్నారు.

భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు