
ఖరీఫ్ సాగేనా!
● శివారుల్లో సాగుపై అనుమానాలు
● జూన్ 1న విడుదల చేసిన నీరు
20వ తేదీ నాటికీ చేరని వైనం
● వర్షాలు కురుస్తున్నా
మందకొడిగా నారుమడులు
● జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో
వరిసాగు అంచనా
● 849 ఎకరాల్లో వెదజల్లు పద్ధతిలో..
సాక్షి, అమలాపురం: ఆశల సాగు ఖరీఫ్ జిల్లాలో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. శివారుల్లో ముంపు భయం.. ఆలస్యంగా వదలిన సాగునీరు.. విడుదల కాని ధాన్యం సొమ్ములు... ప్రభుత్వం అందించని అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం... ఇలా చెప్పుకుంటూ పోతే ఖరీఫ్కు అడుగడుగునా అవాంతరాలే. దీనితో శివారుల్లో ముందస్తు సాగు అటుంచి ఆలస్యంగానైనా సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు.
గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు నత్తను తలపిస్తోంది. గడిచిన మూడేళ్లుగా ముందస్తు సాగు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఖరీఫ్ ఆలస్యమవుతోంది. తొలకరి సాగుకు వేగంగా నారుమడులు పడే జూన్ నెలలోనే ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 12,640 ఎకరాలకు సరిపడా అకుమడులు పడ్డాయి. అలాగే మరో 849 ఎకరాల్లో వెదజల్లు పద్ధతిలో విత్తనాలు చల్లారు. మొత్తంగా ఇప్పటి వరకు 13,489 ఎకరాల్లో మాత్రమే సాగు మొదలైనట్టు అంచనా. అంటే ఇప్పటి వరకు పది శాతం కూడా నారుమడులు పడలేదు. జిల్లాలో గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం పడుతుండడంతో రైతులు నారు మడులు, వెదజల్లు దుక్కులకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ వారం రోజులలో కొంతమేర నారుమడులు వేగం అందుకుంటున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అడుగడుగునా ఆటంకాలు
జిల్లాలో ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. సాగు చేసేందుకు సన్నాహాలు చేసుకుందామనుకున్న రైతులకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముందస్తు సాగు చేద్దామంటే జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేసినా 20 తరువాత కాని చేలకు చేరలేదు. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అలాగే శివారుల్లో ముంపు భయం వీడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పంట నష్టపోతే పరిహారం వస్తుందనే భరోసా లేకుండా పోయింది. ఈ కారణాలతో రైతులు కూడా ఉత్సాహంగా ముందుకు రాలేదు.
ముందస్తు లేకుండా చేశారు
ముందస్తు సాగు చేయడం ద్వారా కోనసీమ (మధ్య డెల్టా)లో ఖరీఫ్ పంటను ముంపు నుంచి కాపాడుకునే అవకాశముంది. లేకుంటే అక్టోబరు 15 నుంచి నవంబరు 15 మధ్య ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుల వల్ల రైతులు పంట నష్టపోతున్నారు. ముందస్తు సాగు వల్ల పంట ముంపు నుంచి బయట పడుతుందని రైతుల అంచనా. దీనిని గుర్తించి గత ప్రభుత్వం ముందస్తు సాగుకు దన్నుగా జూన్ 1వ తేదీన సాగునీరు విడుదల చేసేది.
కూటమి ప్రభుత్వం మాత్రం జూన్ 1న ధవళేశ్వరం, బొబ్బర్లంక హెడ్ స్లూయిజ్ల ద్వారా సాగునీరు వదిలినట్టే వదిలి తూర్పు డెల్టా కాలువలపై వేమగిరి వద్ద 15 తేదీ వరకు, మధ్య డెల్టా కాలువపై లొల్ల లాకుల వద్ద 20వ తేదీ వరకు నీరు నిలిపివేశారు. దీనితో శివారు ప్రాంతాలకు నీటి విడుదల ఆలస్యమైంది. ఈ సమయంలో నారు వేస్తే జూలై మొదటి వారంలో వర్షాలకు దెబ్బతింటుందని, ఆలస్యం వేస్తే మంచిదనే ఉద్దేశంతో ఉన్నారు. దీని వల్ల కూడా నారుమడులు ఆలస్యం కానున్నాయి.