
పెద్దపేట విద్యార్థులను తరలించం
● డీఈఓ సలీం బాషా
● పలు పాఠశాలల తనిఖీ
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానంలోని పెద్దపేట పాఠశాల విద్యార్థులను ఎక్కడికీ తరలించబోమని ఆ పాఠశాలలోనే కొనసాగేలా చర్యలు తీసుకున్నట్టు డీఈఓ సలీం బాషా ఆ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. మండలంలోని భీమనపల్లి, గొల్లవిల్లి, ఎన్.కొత్తపల్లి, ఎస్.యానం జెడ్పీ ఉన్నత పాఠశాలలను, ఎస్.యానంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో డీఈవో సలీం బాషా గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని, విద్యామిత్ర కిట్లను ఆయన పరిశీలించారు. అలాగే ఎస్.యానం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఓ పాఠ్యాంశాన్ని బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ను విజయవంతం చేయాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఒకటో తరగతిలో 19,335 మంది విద్యార్థులను చేర్చాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 14.894 మందిని చేర్చినట్టు తెలిపారు. ఈ నెలాఖరు లోగా మిగిలిన వారిని చేర్పించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఎస్.యానం గ్రామంలో పెద్దపేట పాఠశాలలో మోడల్ స్కూల్ పేరుతో తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపబోమని డీఈఓ పేర్కొన్నారు. విద్యార్థులతో తల్లిదండ్రులు నిరసన చేపట్టడంతో ఆ పాఠశాలను డీఈఓ సందర్శించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా స్థానిక పాఠశాలలోనే తరగతులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఆయన వెంట ఎంఈవోలు కె.కిరణ్బాబు, ఎస్.సత్యకృష్ణ తదితరులున్నారు.