
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం రూరల్: వర్షాల నేపథ్యంలో గోదావరికి వరదలు సంభవిస్తే, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ విపత్తుల సహాయక చర్యలపై ప్రతి శాఖ సమాయత్తం కావాలని, గోదావరి తీరం వెంబడి ఉన్న మండలాలకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. కావాల్సిన అవసరాలపై జూలై మొదటి వారంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏటిగట్టు బలహీనంగా ఉన్నచోట్ల సైనింగ్ బోర్డులను ఏర్పాటు చేస్తూ గట్ల పటిష్టతకు ఇసుక సంచులను సిద్ధం చేసుకోవాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. పశువులకు పునరావాసం కల్పించి టోటల్ మిక్సర్ రేషన్ (టీఎంఆర్) పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని ఆ శాఖ అధికారుకు తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి.కృష్ణారావు మాట్లాడుతూ పోలీస్ శాఖ సహాయ చర్యలకు సన్నద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాజకుమారి, ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రశంసాపత్రాల అందజేత
యోగాంధ్రలో భాగంగా ఈ నెల మూడో తేదీన బీచ్, దేవాలయ యోగాసనాల కార్యక్రమంలో అంతర్వేది సముద్ర తీరంలో మూడు వేల మందితో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహార యోగాసనలో జిల్లాకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు విజయోత్సవాన్ని గోదావరి భవన్లో అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా యోగేంద్ర నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ నిషాంతి సారథ్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతమయ్యాయన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లాస్థాయి అధికారులను ప్రశంసా పత్రాలు అందించి, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు డీఆర్ఓ రాజకుమారి ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.
భూ పరిపాలన అంశాలపై ప్రత్యేక దృష్టి
భూ పరిపాలన అంశాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి, కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అమరావతి నుంచి బుధవారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ, అందరికీ ఇళ్లు, నూతన కోర్టు భవనాలు తదితర వాటిపై సమక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ఆన్లైన్, పెండింగ్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియపై అందిన దరఖాస్తులను విచారించి అర్హతల మేరకు క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మహేష్ కుమార్
అధికారులతో సమీక్ష