● నెల రోజుల పాటు పనులకు దూరం
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ధ్వజం
అమలాపురం టౌన్: యోగాంధ్ర పేరిట అధికారులు నెల రోజుల పాటు పనులు చేయకుండా కాలక్షేపం చేశారని, ఆహార భద్రతను గాలికి వదిలేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని హైస్కూల్ సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. నేడు లక్షలాది మంది గుండె జబ్బులు, లివర్, కిడ్నీ వంటి వ్యాధులకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. నేటి యువతలో అనేక మంది పాన్ పరాగ్ వంటి మాదక ద్రవ్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని పేర్కొన్నారు. పంట కాల్వల్లోకి సెప్టీక్లీన్ వ్యర్థాలను గొట్టాల ద్వారా తరలిసూ కలుషితం చేస్తున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నా యోగాంధ్ర పేరుతో అధికారుల హడావుడి తప్ప వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ప్రజారోగ్యానికి సంబంధించి ఎక్కడా తనిఖీలు లేవని ధ్వజమెత్తారు. యోగాంధ్ర పేరుతో ప్రచారం తప్ప ఎక్కడా కార్యాచరణ లేదని ఆరోపించారు. పాఠశాలల్లో పిల్లలకు వ్యాయామం తప్పనిసరి చేసి రోజూ ఓ గంట సేపు చేయించాలని. ఒక్క రోజు, లేదా కొన్ని రోజుల యోగా శిక్షణలతో ఆరోగ్య సమాజం సిద్ధించదని, అది నిరంతర ప్రక్రియ అని, శిక్షణ అయినప్పుడే దాని వల్ల ప్రయోజనాలు సార్థకం అవుతాయని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అభిప్రాయపడ్డారు.