
వచ్చే నెల 9న దేశవ్యాప్త సమ్మె
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు వచ్చేనెల 9న నిర్వహించనున్న ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ రాజమండ్రి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ ఎల్ఐసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మోరంపూడిలోని ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఎల్ఐసీ క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగుల నిరసన ప్రదర్శన చేశారు. కోదండరామ్ మాట్లాడుతూ బీమా భారంగా మారిన తరుణంలో జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ బీమా, బ్యాంకులను కాపాడాలని కోరారు. కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్లను రద్దు చేసి, ఎల్ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్–3, 4 ఉద్యోగుల నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించవద్దని కోదండరామ్ డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు మాఽథ్యూస్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో యూనియన్ నాయకులు, సత్యదేవ, పిఎస్ఎన్ రాజు, ఈశ్వరరావు, పట్నాయక్, ఇమ్రాన్, శిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.