
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
అమలాపురం టౌన్: స్పోర్ట్స్ ఫర్ యూనిటీ నినాదంతో జిల్లాలో ఒలింపిక్ డే ఉత్సవాలతోపాటు రన్లు కూడా సోమవారం ఉదయం ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంతో పాటు జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో ఒలింపిక్ రన్లు ఏకకాలంలో సాగాయి. అమలాపురం పట్టణంలో జరిగిన ఒలింపిక్ డే వేడుకలు ఉత్సవంగా స్థానిక దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జరిగాయి. ఈ క్లబ్ భవనం నుంచే ఒలింపిక్ రన్ మొదలైంది. ఈ వేడుకల్లో అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ శరత్బాబు, పప్పుల శ్రీరామచంద్రమూర్తి పర్యవేక్షణలో రన్ సాగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ ఒలింపిక్స్ గేమ్స్ అంటే ఐక్యతకు చిహ్నమని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా అమలాపురంలో ఒలింపిక్ డే రన్ను నిర్వహిస్తున్న జిల్లా అసోసియేషన్ను అభినందించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ ఒలింపిక్ డే రన్ స్ఫూర్తితో జిల్లాకు చెందిన క్రీడాకారులు అమలాపురం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సాత్విక్ సాయిరాజ్ను ఆదర్శంగా తీసుకుని సత్తా చాటాలని ఆకాంక్షించారు.
నాలుగు కిలోమీటర్లు సాగిన ఒలింపిక్ రన్
స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ వద్ద ఒలింపిక్ డే ఉత్సవాలు జరిగిన తర్వాత రన్ను అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్, ఎమ్మెల్యే సూర్యనారాయణరావు, డీఎస్పీ ప్రసాద్లు ఒలింపిక్ టార్చ్ పట్టుకుని ప్రారంభించారు. రన్ ముమ్మిడివరం గేటు సెంటర్ మీదుగా గడియారం స్తంభం సెంటరు, ముస్లిం వీధి, గాంధీబజార్, రవణం వీధి, గారపాటి వీధి, గండువీధి మీదుగా తిరిగి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర సాగి ఆఫీసర్స్ క్లబ్కు చేరుకుంది. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, వాకర్స్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వర ప్రసాద్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మునగాల మన్యం రన్లో పాల్గొన్నారు.
4 కిలోమీటర్ల మేర సాగిన పరుగు
ప్రారంభించిన అంతర్జాతీయ
క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్,
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు,
డీఎస్పీ ప్రసాద్
జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో నిర్వహణ

ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్