
కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీలు
అమలాపురం రూరల్: వేతనాలు పెంచాలని కోరుతూ కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్లోకి వెళ్లాడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్ వద్ద అందోళన చేశారు. సూమారు గంటపాటు అందోళన చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణవేణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశించారని కానీ వేతనాలు పెంచకపోగా పని భారాన్ని తీవ్రంగా పెంచి రకరకాల యాప్ల పేరుతో ప్రీస్కూల్ని అటకెక్కించారని అన్నారు. పదివేల రూపాయలు వేతనం దాటింది అనే పేరుతో మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు నిలుపుదల చేశారని ప్రభుత్వ ఉద్యోగం అని ఆన్లైన్లో చూపిస్తోందని, సంక్షేమ పథకాలు రావని సచివాలయాల దగ్గర చెప్తున్నారని అన్నారు. అంగన్వాడీ హెల్పర్లు, మినీ వర్కర్లు ఏం పాపం చేశారని సంక్షేమ పథకాల అమలు చేయడం లేదని అన్నారు. రూ.11,500తో ఎట్లా బతకాలని, ఎంతోమంది ఒంటరి మహిళలు ఈ జీతం మీదే ఆధారపడి బతుకుతుంటే వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి మాట్లాడుతూ రెండు నెలలుగా అంగన్వీడీలకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు 20వ తేదీలోపు బిల్లు పెట్టకపోవడం దారుణమని అన్నారు. సీఐటీయూ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఎన్ బలరాం, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు పి.అమూల్యకే, పి రత్నకుమారి, మహేశ్వరి, సుజాత పాల్గొన్నారు.