
లక్ష్మీనరసింహస్వామి హుండీల ఆదాయం రూ.44,20,491
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామివారి దేవస్థానంలో శుక్రవారం అధికారులు నిర్వహించిన హుండీల లెక్కింపులో స్వామివారికి రూ.44,20,491 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకూ 87 రోజులకు గాను పై ఆదాయం సమకూరింది. జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ హుండీల లెక్కింపు చేపట్టారు. మెయిన్ హుండీల ద్వారా రూ.42,44,077, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.19,824, అన్నదానం హుండీల ద్వారా రూ.1,56,590 ఆదాయం లభించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు.
బుచ్చయ్య చౌదరి
క్షమాపణ చెప్పాలి
● లేదంటే రాజమహేంద్రవరంలో తిరగలేరు
● మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదు
● మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
కోరుకొండ: తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకుని నరుకుతామంటూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోరు పారేసుకోవడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. చేసిన తప్పుడు వ్యాఖ్యలకు బుచ్చయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోరుకొండ మండలం కణుపూరులో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన బుచ్చయ్యను మహిళలు తరిమేసిన ఘటనను గుర్తు చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెచ్చరిల్లుతున్న హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలో దయనీయమైన స్థితిలోకి జారిపోయిందన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దాడులు, కేసులు, అరెస్టులతో భౌతికంగా వేధిస్తోందని ధ్వజమెత్తారు. మూడు పార్టీలు కలసి గెలవడం పెద్ద విషయం కాదన్నారు. వైఎస్సార్ సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, జగన్కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదనే విషయాన్ని చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం ప్రజలను భయపెట్టే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. జగన్ పర్యటనలకు తరలి వస్తున్న జనసమూహాన్ని టీడీపీ నాయకులు ఆపలేరన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు చంద్రబాబు ఆలోచనా విధానాన్నే కూటమి ఎమ్మెల్యేలు, నాయకు లు అనుసరించడం శోచనీయమన్నారు. సీనియర్ ఎ మ్మెల్యేగా చెప్పుకొంటున్న గోరంట్ల బుచ్చ య్య చౌదరి ఇంగితజ్ఞానం మరచి, మాజీ సీఎం జగన్పై అన్న తప్పుడు మాటలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాజమహేం ద్రవరంలో తిరగలేరని రాజా హెచ్చరించారు.
జగన్ను భూస్థాపితం చేయడం
ఎవ్వరి తరమూ కాదు
కాకినాడ రూరల్: ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భూస్థాపితం చేయడం ఎవ్వరి తరమూ కాదని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు తాము అభిమానించే నాయకుడిని కలుసుకోవడం కూడా తప్పే అన్నట్లు చిత్రీకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిచారు. జగన్ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు, తల నరికేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చి, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా జగన్ ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదంటూ గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల ద్వారానే ఎన్టీఆర్ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నించారని, అది సాధ్యం కాదని గ్రహించి, నేడు అధికారం కాపాడుకునేందుకు ఆయన విగ్రహాలను పూజిస్తున్నారని అన్నారు. నాయకుడిగా ఎదగకూడదనే దురుద్దేశంతో వంగవీటి మోహన్రంగాను భూస్థాపితం చేశారని ఆరోపించారు. గోరంట్ల, అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా స్వీకరించి, తమ నాయకుడు జగన్కు రక్షణ కల్పించాలని నాగమణి విజ్ఞప్తి చేశారు.

లక్ష్మీనరసింహస్వామి హుండీల ఆదాయం రూ.44,20,491