యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులు..ప్రయాణికులకు అవస్థలు | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులు..ప్రయాణికులకు అవస్థలు

Jun 21 2025 3:17 AM | Updated on Jun 21 2025 3:17 AM

యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులు..ప్రయాణికులకు అవస్థలు

యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులు..ప్రయాణికులకు అవస్థలు

అమలాపురం రూరల్‌: విశాఖపట్నంలో శనివారం జరిగే యోగాంధ్ర కార్యక్రమం కోసం ఆర్టీసీ బస్సులను తరలించడంతో కోనసీమలో నాలుగు ఆర్టీసీ డిపోల పరిధిలోని బస్టాండుల్లో బస్సులు లేక శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను దాదాపుగా రద్దు చేశారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడక తప్పలేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమానికి కోనసీమ జిల్లా నుంచి 160 ఆర్టీసి బస్సులు విశాఖకు తరలి వెళ్లాయి. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి ప్రజలను తరలించేందుకు ఈ బస్సులు వెళ్లాయి. అమలాపురం డిపో నుంచి 58, రావులపాలెం నుంచి 41, రామచంద్రపురం నుంచి 40, రాజోలు నుంచి 20 బస్సులు పంపించినట్లు జిల్లా రవాణా అధికారి రాఘవకుమార్‌ తెలిపారు. అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. 58 బస్సులు యోగాంధ్ర వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజమహేంద్రవరం, కాకినాడ రూట్లలో 15 నిమషాలకు ఒక బస్సు తిరిగేది. బస్సులు తగ్గించడంతో 45 నిమిషాలకు ఒకటి చొప్పున నడపడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. విజయవాడ, విశాఖపట్నం రూట్లు, పల్లె వెలుగు బస్సులు కొన్ని రూట్లలో రద్దు చేశారు. ప్రయాణికులు ప్రయివేట్‌ వాహనాల్లో వెళ్లారు.

పాఠశాలు, కళాశాలలకు సెలవు

ఆర్టీసీ బస్సులతో పాటు జిల్లాల్లో జిల్లాలో సమారు 300 ప్రయివేట్‌ స్కూళ్లు, కళాశాలల బస్సులు యోగాంధ్రకు వినియోగించడంతో పాఠశాలలు, కళాశాలలకు గురువారం నుంచి మూడురోజులు సెలవులు ప్రకటించారు. యోగా పేరుతో సెలవు ఇవ్వడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement