
యోగా పోటీలలో ప్రతిభ చాటాలి
అమలాపురం రూరల్: యోగాంధ్ర మాస ఉత్సవాలలో భాగంగా పోటీలలో పాల్గొని ప్రతిభ చాటి జిల్లా పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం గోదావరి భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో.. సోలో విభాగంలో 10–18 మధ్య వయసు వారు 8 మంది పాల్గొన్నారు. 19– 35 మధ్య వయసువారు ముగ్గురు, 35 సంవత్సరాలు పైబడిన వారు నలుగురు పాల్గొన్నారని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 14 వరకు పోటీలలో పాల్గొనవచ్చునన్నారు. విజేతలకు ఈ నెల 21వ తేదీ విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ కనకదుర్గ, జి.దుర్గాప్రసాద్. సీహెచ్ ఉషారాణి, డి.శాంతకుమారి, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 12వ తేదీన కలెక్టరేట్లో పోటీలు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి ఆయుష్ వైద్యాధికారి విజయకుమారి తెలిపారు.