
బాబు పాలనలో భద్రత కరవు
● వైఎస్సార్ సీపీ నేతలు విజయలక్ష్మి, జగ్గిరెడ్డి
● సేవ్ వుమెన్...సేవ్ ఆంధ్ర నినాదంతో పార్టీ మహిళల నిరసన
● అమలాపురంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పణ
● కిలోమీటరు మేర నినాదాలతో సాగిన
నిరసన ర్యాలీ
అమలాపురం టౌన్: చంద్రబాబు పాలనలో మహిళలు, బాలికలకు భద్రత కరవైందని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ వుమెన్...సేవ్ ఆంధ్ర నినాదంతో జిల్లా పార్టీకి చెందిన మహిళా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అమలాపురంలో మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో విజయలక్ష్మి, జగ్గిరెడ్డి మాట్లాడారు. తొలుత స్థానిక సూర్యనగర్లోని పార్టీ నేత దివంగత కుడుపూడి చిట్టబ్బాయి ఇంటి వద్ద నుంచి పార్టీ మహిళలతో ర్యాలీ ప్రారంభించారు. హైస్కూలు సెంటరు, గొల్లగూడెం, శ్రీరామపురం మీదుగా మద్దాలవారిపేటకు దాదాపు కిలోమీటరు మీర నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలు, బాలికలకు రక్షణ ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం రాజీనామా చేయాలని ర్యాలీలో నినాదాలు చేశారు. పాదయాత్ర మద్దాలవారిపేట చేరుకున్నాక ఆ పేటలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీకి చెందిన జిల్లా మహిళలు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు వద్దని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలోని మహిళలకు, బాలికలకు భద్రత, రక్షణ కల్పించాలని అంబేడ్కర్ విగ్రహాన్ని వేడుకున్నారు. అనంతరం విజయలక్ష్మి, జగ్గిరెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది కాలంలో మహిళలు, బాలికలపై 188 హత్యలు, అత్యాచారాలు జరిగాయని విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. 15 కేసుల్లో మహిళలు, బాలికలు అత్యాచారాలతో పాటు హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోవడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతోందన్నారు. ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనను డైవర్ట్ చేసేందుకు, అక్రమాలను ప్రశ్నిస్తున్న సాక్షి చానల్, పత్రికపై అక్రమ కేసులు పెడుతోందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అమలాపురం, మండపేట మున్సిపల్ చైర్పర్సన్లు రెడ్డి సత్య నాగేంద్రమణి, పతివాడ నూక దుర్గావాణి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాష్ట్ర దృశ్య కళల అకాడమి మాజీ చైర్పర్సన్ కుడుపూడి సత్య శైలజ, జిల్లా పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు కాశి ముని కుమారి, అమలాపురం, అల్లవరం, అయినవిల్లి ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, మట్టపర్తి నాగ విజయలక్ష్మి, అల్లవరం జెడ్పీటీసీ సభ్యురాలు కొనుకు గౌతమి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, నియోజకవర్గంలోని పట్టణం, మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, బద్రి బాబ్జి, కొనుకు బాపూజీ, గుత్తుల చిరంజీవి, పార్టీ అనుబంధ కమిటీల జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్, జాన గణేష్, చీకట్ల కిషోర్, తోరం గౌతమ్ రాజా, సూదా గణపతి, మున్సిపల్ కౌన్సిలర్లు నాగవరపు వెంకటేశ్వరరావు, దొమ్మేటి రాము, కొల్లాటి దుర్గాబాయి, యన్నాబత్తుల పద్మ, రాజీ గోపి, కట్టోజు సన్నయ్యదాసు, బండారు గోవిందు, పార్టీ నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, మెండు సురేష్బాబు, బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురవుతున్న నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

బాబు పాలనలో భద్రత కరవు