
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు సాధించిన 168 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఈ అవార్డులు అందజేశారు. పదో తరగతిలో 139 మంది, ఇంటర్లో 29 మంది విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు బహుమతి, ప్రశంసా మెడల్ బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామర్థ్యాన్ని బట్టి విద్యార్థులను ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాను రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపామని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించి, సత్ఫలితాలు రాబట్టామన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడికి కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని, ఫలితాలను మెరుగుపరిచే బాధ్యత అప్పగించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో ముచ్చటించి, భవిష్యత్తు ప్రణాళికలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి, జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీం బాషా, ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖాధికారి వి.సోమశేఖరరావు, సర్వ శిక్ష ఏపీసీ జి.మమ్మీ తదితరులు పాల్గొన్నారు.