
కరవాక తీరానికి వింత జీవులు
మలికిపురం: మండలంలోని గొల్లపాలెం, కరవాక సముద్ర తీరానికి వింత జీవులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జనసంచారం లేని సమయంలో, రాత్రివేళల్లో సముద్రం నుంచి భారీ జంతువులు తీరానికి వచ్చి సేద తీరి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఆ జీవులు ఏంటనేది తెలియడం లేదు. అయితే జంతువుల అడుగులు ఇక్కడ స్పష్టంగా కనిపించడం గమనార్హం. సుమా రు రెండు నుంచి నాలుగు పెద్ద సముద్ర జంతువులు ఇలా తీరానికి వస్తున్నట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఇక్కడ సముద్రం లోతు అధికంగా ఉండడం వల్ల భారీ సముద్ర జీవులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రగతిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ కాకినాడ, వాద్వాని ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రైన్ది ట్రైనర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ అండ్ వెంచర్ క్రియేషన్ అంశంపై ఐదు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని సోమవారం జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి స్వయం ఉపాధికి సంబంధించిన కార్యక్రమాలు వికసిత్ భారత్ 2047–సర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయడానికి దోహదపడతాయన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ శిక్షణకు తమ కళాశాలను ఎంచుకోవడం సంతోషంగా ఉందని, వాద్వాని ఫౌండేషన్ డైరెక్టర్, పార్టనర్ షిప్ దయాకరమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. జేఎన్టీయూకే అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలకృష్ణ, డైరెక్టర్ మేనేజ్మెంట్ హరినాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరెక్టర్ అకడమిక్స్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి.నరేష్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ కె.ఆనంద్ పాల్గొన్నారు.

కరవాక తీరానికి వింత జీవులు