
ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ ఎస్సారెస్పీ కెనాల్లో చోటుచేసుకుంది.
సాక్షి, జగిత్యాల : ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ ఎస్సారెస్పీ కెనాల్లో చోటుచేసుకుంది. మృతులను రవీంద్రనాథ్ ఠాగూర్ నగర్కు చెందిన కిరణ్, ధరూర్ కు చెందిన రవిగా గుర్తించారు. సెల్ఫీ తీసుకుంటుండగా జారి కెనాల్లో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. అయితే ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేసి కెనాల్లో పడేశారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. (ఆరడుగుల స్థలం కోసం ఘర్షణ )
దీంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన లేక కావాలనే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ముందురోజు రాత్రి మిత్రులు కిరణ్, రవితో పాటు గురు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఇద్దరు కెనాల్లో దిగి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఇద్దరి మృతదేహాలపై గాయాలు ఉండటంతో పాటు గురు అనే వ్యక్తి కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇది హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. (మనవడిని హత్య చేసిన తాత )