అమెరికాలో తెలుగు యువతి మృతి.. భారత్‌ డిమాండ్‌ ఇదే.. | Telugu woman died in a road accident in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు యువతి మృతి.. భారత్‌ డిమాండ్‌ ఇదే..

Sep 14 2023 2:56 AM | Updated on Sep 14 2023 1:37 PM

Telugu woman died in a road accident in America - Sakshi

సియాటెల్‌:  అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన అంశం కలకలం రేపుతోంది. సదరు పోలీసు అధికారి నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

అసలేం జరిగింది? 
అమెరికాలో సియాటెల్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీలో చదువుతున్న కర్నూలు జిల్లా ఆదోని యువతి జాహ్నవి (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదీ పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. ఆ ఘటన విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచి్చన పోలీసు అధికారి డానియెల్‌ అడరర్‌.. పైఅధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల చులకనగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ ‘ఆమె చచ్చిపోయింది. ఆ ఓ మామూలు వ్యక్తేలే..’ అని వ్యాఖ్యానించారు.

పోలీసు వాహనమే ఢీకొట్టిన నేపథ్యంలో.. ‘ఏముంది. ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు  ఉంటాయేమో.. విలువ తక్కువే..’ అని పగలబడి నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డైంది. తాజాగా ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో.. సియాటెల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంది. డానియెల్‌ అడరర్‌పై విచారణకు ఆదేశించింది.  

తప్పుడు వివరాలతోనూ.. 
జాహ్నవిని ఢీకొని ఆమె మరణానికి కారణమైన తోటి పోలీసు అధికారి కెవిన్‌ను కాపాడేందుకు డానియెల్‌ ప్రయత్నించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కెవిన్‌ కారును గంటకు 50 మైళ్ల వేగంతోనే నడుపుతున్నాడని, కారు అదుపు తప్పలేదని డానియల్‌ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నాడు. తప్పు జాహ్నవిదే అన్నట్టుగా చూపడానికి ప్రయత్నించాడు. అయితే కెవిన్‌ కారును పరిమితికి మించి 74 మైళ్ల వేగంతో నడిపాడని, కారు అదుపు తప్పిందని తర్వాత ఫోరెన్సిక్, ఇతర దర్యాప్తు నివేదికల్లో తేలడం గమనార్హం.  

‘జాహ్నవి కందుల మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సియాటిల్‌ అలాగే వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం. అలాగే సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం’ అని దౌత్యకార్యాలయం వెల్లడించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement