ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Police Caught Gujarati Based Online Gaming Betting Bookies    - Sakshi

అమీర్‌పేట: గుజరాత్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా పట్టుబడ్డ వారి నుంచి రూ.1.15 కోట్ల నగదు, సెల్‌ ఫోన్లు, క్యాష్‌ కౌంటింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటన వివరాలను ఇన్స్‌పెక్టర్‌ సైదులు, డీఐ రాంప్రసాద్‌లు వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన విశాల్‌ పటేల్, కమలేష్‌రావత్, పటేల్‌ హితేష్‌ అంబాల, ధర్మేంద్ర భాయ్‌లు నగరంలోని గౌలిగూడ గురుద్వార, గౌలిపుర పరిసర ప్రాంతంలో నివాసముంటున్నారు.

వీరు గుజరాత్‌ ప్రధాన కేంద్రంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు వేసి ప్రచారం చేస్తారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ బెట్టింగ్‌ల ద్వారా అతి తక్కువ కాలంలో లక్షలు సంపాదించి ఆపై కోటీశ్వరులుగా ఎదుగుతారని నమ్మిస్తారు. సదరు వెబ్‌సైట్‌లో పొందుపర్చిన అందర్‌ బహార్, ఫుట్‌బాల్, క్రికెట్, సూపర్‌ ఓవర్, తీన్‌పత్తి వంటి గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి బెట్టింగ్‌లలో పాల్గొనే వీలు కల్పిస్తారు.

కాగా నగరంలో వీరి వలలో పడిన వారినుంచి డబ్బులు తీసుకునేందుకు రాగా..పక్కా సమాచారం మేరకు బీకేగూడ పార్కు వద్ద మాటువేసి పోలీసులు విశాల్‌ పటేల్, కమలేష్‌ రావత్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద రూ.2 లక్షలు లభించాయి. వీరిచ్చిన సమాచారంతో గౌలిగూడలో ఒక ఇంటికి వెళ్లి సోదాలు చేయగా లోపల పటేల్‌ హితేష్‌ అంబాల కనిపించాడు. ఇతని వద్ద రూ.1.13 కోట్లు లభించాయి. ముగ్గుర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నింధితుడు ధర్మేష్‌ భాయ్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.  

(చదవండి: అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్‌ నిషేధం నై)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top