పోలీసులకు తలనొప్పిగా మారిన కేసు..

Panjagutta Molestation Case Handover To CID - Sakshi

ఆరోపణలకు సంబంధించి ఆధారాల్లేవ్‌

హోటల్స్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ దొరకడం అసాధ్యం

బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటు నిందితుల ఫిర్యాదు

ఎన్జీఓ ప్రతినిధిపై అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ అత్యాచారం కేసు పోలీసులకి తలనొప్పిగా మారింది. గడిచిన 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీస్‌ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో లోతైన దర్యాప్తు కోసం కేసు బాధ్యతను ఎవరికి అప్పగించాలో కసరత్తు చేస్తున్నారు. ఈ కేసును సీఐడికి అప్పగించాలా లేదా సీసీఎస్‌కి బదిలీ చేయాలా అనే దాని గురించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. 

ఆధారాలు లేవు.. సీసీఫుటేజ్‌ దొరకడం అసాధ్యం
నిజంగానే తొమ్మిదేళ్లుగా యువతిపై అత్యాచారం చేస్తూ వస్తున్నా ఎందుకు ఇప్పటి వరకు బాధితురాలు నోరు విప్పలేదు? పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు అనుకున్న మరి మీడియా ముందుకు రావొచ్చు కదా అనే వారు కూడా లేక పోలేదు. అయితే ఈ ప్రశ్నల గురించి భరోసా సెంటర్‌లో కౌన్సలింగ్ చేస్తున్న పోలీసులు భాదితురాలను ప్రశ్నించగా కొన్నిటికి సమాదానాలు ఇచ్చింది. ‘ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే నిన్ను చంపేస్తాం .. నీకు వెనుక ముందు ఎవరు లేరు’ అని చాలా మంది కాల్స్ చేసి బెదిరించారని తెలిపింది. దాంతో ఆ వేధింపులు భరించలేక తానే ఆత్మహత్య చేసుకుందాం అని నిర్ణయం తీసుకొని మరణ వాంగ్మూలం కూడా రాసి పెట్టినట్లు బాధితురాలు వెల్లడించింది. (143 మంది అత్యాచారం చేశారు)

ఈ ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని బాధితురాలిని ప్రశ్నించగా.. లేవని.. కానీ తాను వెళ్లిన హోటల్స్ అడ్రస్‌లు చెపుతాను అక్కడికి వెళ్లి దర్యాప్తు చేయండి అంటూ పోలీసులుకి సూచనలు చేసింది. ఈ మేరకు అక్కడకు వెళ్లిన పోలీసులకు తొమ్మదేళ్ళ క్రితం, ఐదేళ్ల క్రితం ఫుటేజ్ ఇప్పుడు దొరకడం అనేది అసాధారణంగా మారింది. 

బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు: నిందితులు
ఎలాగో ఆధారాలు దొరకవు కాబట్టే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందని.. ఆ అమ్మయిని మేము ఎప్పుడు చూడనే లేదని 139 మందిలో కొంత మంది పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే ఇన్ని సంచలనాలు ఉన్న కేసులో వాస్తవం ఏంటి.. అసలు ఈ కేసులో ఎవరైనా బాధితురాలను అడ్డం పెట్టుకొని మొత్తం కథ నడుపుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిందితులు కొంత మంది పోలీసులుకి సమాచారం ఇచ్చారు. నిజంగా డబ్బులు కోసం బాధితురాలను పావుగా వాడుకొని ఇలా పథకం వేశారా.. బాధితురాలు వెనుక ఉండి ఓ ఎన్జీఓ ప్రతినిధి నడిపిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. (యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్‌!)

కేసు సీఐడీకీ లేదా సీసీఎస్‌కు బదిలీ
ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా చేయాలి? ఏవిధంగా ముందుకు వెళ్లాలి? అనుమానితులను ఏ విధంగా ప్రశ్నించాలి? మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారిని ఏ విధంగా పిలవాలి? వీటన్నిటిపై పోలీసులు సమగ్ర ప్రణాళిక చేయబోతున్నారు. అయితే, పంజాగుట్ట పోలీసులతో విచారణ కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలా? లేకుంటే సీసీఎస్‌కు ఈ కేసును బదిలీ చేయాలా? అనే దాని పైన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు.  న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత అడుగు ముందుకేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి అనుమతిస్తే దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తారు. లేదంటే ఈ కేసును పంజాగుట్ట ఠాణా నుంచి సీసీఎస్‌కు బదిలీ చేయాలా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top