
బైందిర్ సైకిల్ని అతడిపై విసిరాడు. అంతటితో ఆగకుండా అతనికి ఓ పాఠం నేర్పుతా అంటూ...
చంఢీగడ్: హర్యానాలోని పంచకుల జిల్లాలో సైకిల్ పార్కింగ్ వివాదంలో ఓ 55 ఏళ్ల వ్యక్తిని పొరుగునవారు కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళితే.. బైందర్ అనే వ్యక్తి ఇందిరా కాలనీలోని సెక్టార్16 లో నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం తన నివాసం వెలుపల సైకిల్ను పార్క్ చేశాడు. వీధిలో సైకిల్ను పార్కింగ్ చేయడంపై బాధితుడు, అతని పొరుగు వ్యక్తి సతీశ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సతీష్ కోపంతో బైందిర్ సైకిల్ని అతడిపై విసిరాడు. అంతటితో ఆగకుండా అతనికి ఓ పాఠం నేర్పుతా అంటూ బెదిరించాడు.
తర్వాత సతీశ్ తన ఇద్దరు కుమారులు విక్కీ, సన్నీ, పొరుగునే ఉన్న మహిపాల్, మోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తి, రాడ్లు, కర్రలతో బైందర్ కుటుంబంపై దాడిచేశారు. విక్కీ బైందర్ను ఛాతిపై కత్తితో పొడవడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బాధితుడి భార్య, ఇద్దరు కుమారులు కూడా గాయపడ్డారు. ఐదుగురు నిందితులపై 302, 321, 148 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పార్కింగ్ విషయంలో ఇరు పార్టీలు పలుసార్లు గొడవ పడ్డాయని పోలీసులు తెలిపారు.