అక్రమ వలసదారులకు ‘ఆధార్‌’ బంగ్లా ముఠా అరెస్టు | Gang helping illegal Bangladeshi migrants get Aadhaar | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదారులకు ‘ఆధార్‌’ బంగ్లా ముఠా అరెస్టు

Jun 12 2022 5:59 AM | Updated on Jun 12 2022 5:59 AM

Gang helping illegal Bangladeshi migrants get Aadhaar - Sakshi

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఏటీఎంను దోచుకున్న దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు అనూహ్యంగా నకిలీ ఆధార్‌ కార్డులను తయారు చేస్తున్న బంగ్లా దేశీయుల ముఠా చిక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్‌ ఇస్మాయిల్‌ కితాబ్‌ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్‌ చేశారు.

విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్‌ అకూన్‌ గురించి వెల్లడించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్‌ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్‌ అంగీకరించాడు. అకూన్‌ ఇంట్లో 31 ఆధార్‌కార్డులు, 13, పాన్‌కార్డులు, 90 ఆధార్‌ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్‌ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు నిర్థారణయింది.  ఈ కేసులో  మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement