దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికి.. బొప్పాయి తోటలో శవమై తేలిన బాలుడు
సాక్షి, చిత్తూరు: దసరా వేడుకలతో ఆనందంగా గడవాల్సిన ఆ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. పండక్కి అమ్మమ్మ ఇంటికొచ్చిన మనవడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన కె.వి పల్లి మండలంలో బుధవారం వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు కిరాతకంగా హతమార్చారు.
మంగళవారం అదృశ్యమైన బాలుడు తేజస్ రెడ్డి (8) బొప్పాయి తోటలో శవమై కనిపించాడు. బాలుడు పీలేరు కు చెందిన నాగిరెడ్డి కుమారుడిగా తెలిసింది. దసరా సెలవులు కావడంతో ఇటీవల అమ్మమ్మ ఊరైన కె.వి పల్లి మండలం ఎగువ మేకల వారి పల్లికి తమ కుమారుడు వచ్చినట్టుగా అతని తల్లిదండ్రులు చెప్తున్నారు.
(చదవండి: ‘దిశ వన్ స్టాప్’.. మహిళలపై వేధింపులకు ఫుల్స్టాప్)
తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో నిన్న కె.వి పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అంతలోనే నేడు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరవుతున్నారు. తేజస్ రెడ్డిని బంధువులే చంపారని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ ఘాతుకానికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: ఫోన్ కొట్టు.. అవినీతి ఆటకట్టు)