ఫీడర్ కాలువల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సమావేశంలో కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి చెరువుకూ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో భూగర్భ నీటి మట్టాన్ని పెంచడమే లక్ష్యంగా జలధార నీటి భద్రతలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,106 చెరువులకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి మండలం పరిధిలో ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వాటికి నీటిని అందించే ఫీడర్ కాలువ లు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ అయ్యాయా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆందోళన కలిగిస్తున్న భూగర్భ జలాలు
గత ఆరు నెలల్లో జిల్లాలో భూగర్భ జలాలు సుమారు 6 మీటర్ల మేర తగ్గిపోవడం పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార, జలహారతి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఫీడర్ కాలువల పున రుద్ధరణ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికుల ద్వారా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. శ్రామికు లు పని చేయలేని క్లిష్ట ప్రాంతాల్లో ప్రత్యేక టీఆర్–27 నిధులతో యంత్రాల సహాయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దపంజాణి, పల మనేరు, వి.కోట, బైరెడ్డిపల్లి, గంగవరం మండలా ల్లోని చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు, గ్రౌండ్ వాటర్ డీడీ గోవర్దన్ పాల్గొన్నారు.
ప్రతి చెరువుకూ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి


