చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీసిటీ సంయుక్తంగా మే 10 నుంచి వికలాంగ యువత కోసం ప్రత్యేక వెల్డింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు 6 మీటర్ల మేర తగ్గినట్లు కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘జలధార, నీటి భద్రత’ కింద చేపట్టిన మైనర్ ఇరిగేషన్ పనులు, ఫీడర్ కాలువల పునరుద్ధరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 313 రెమెడియల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ తరగతులకు విద్యార్థులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఈవో రాజేంద్రప్రసాద్, డ్వామా పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.


