– పలమనేరులో బాక్సు రూ.330
పలమనేరు: కొన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన టమాట ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. పలమనేరులోని టమాట మార్కెట్లో శుక్రవారం టాప్రేట్ రూ.330, సగటు ధర రూ.200లు పలికాయి. ఉన్నట్టుండి ధరలు తగ్గడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సరుకు ఎక్కువగా రావడంతోనే ధరలు తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని ఎక్కువ మంది రైతులు రూ.లక్షలు పెట్టుబడి పెట్టి టమాటా పంట సాగు చేశారు. మరో పది రోజుల్లో కాయలను కోయాల్సి వుంది. ఈ క్రమంలో ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బాక్సు ధర రూ.500 దాటితేగాని తమకు గిట్టుబాటుకాదని చెబుతున్నారు.
25న రెడ్క్రాస్ ఎన్నికలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చిత్తూరు జిల్లా శాఖ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఈ నెల 25న కలెక్టరేట్ సమావేశ మందిరం 2వ అంతస్తులో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రెడ్క్రాస్ జిల్లా శాఖలో సభ్యత్వం కలిగిన పాట్రాన్, వైస్ పాట్రాన్, జీవిత సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. రెడ్క్రాస్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. వివరాల కోసం 9493859160, 9885947361 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆర్డబ్ల్యూఎస్
ఎస్ఈగా విజయ్కుమార్
చిత్తూరు కార్పొరేషన్: ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్నకుమార్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇన్చార్జి ఎస్ఈగా చిత్తూరు ఈఈ విజయ్కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన శుక్రవారం ఎస్ఈ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
లక్కీడిప్ డ్రా
చిత్తూరు అర్బన్ : రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘‘హెల్మెట్ పెట్టు – బహుమతి పట్టు’’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ వారం శుక్రవారం లక్కీ డిప్ డ్రా నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ విజేతలను ప్రకటించారు. హెల్మెట్ ధరించిన వాహనదారుల్లో 7 కేటగిరీల్లో విజేతలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. హెల్మెట్ వినియోగం ప్రాణరక్షణకు కీలకమని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.


