చిత్తూరు కలెక్టరేట్ : నేడు పదో తరగతి ఫలితాలు విడుదలవుతున్న వేళ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి లోకావొద్దని విద్యావేత్తలు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో 129 కేంద్రాల్లో 21,062 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు జీవితంలో భాగం మాత్రమే అని, అవే అంతిమం కాదని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
నిరాశ వద్దు
ఫలితాలు ఏ విధంగా ఉన్నా విద్యార్థులు నిరాశ చెందొద్దని ఉపాధ్యాయులతో పాటు విద్యానిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మార్కులు వస్తే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులు కావొచ్చు. ఎంతో మంది మేథావులు పరీక్షల్లో తప్పినప్పటికీ జీవితంలో రాణించిన వారు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగితే విజయం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫలితం ఒక మజిలీ
పదవ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాలు విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మజిలీ మాత్రమే. కానీ అదే ఆఖరి గమ్యం కాదు. ప్రతి విద్యార్థి పది నెలల పాటు కష్టపడి చదివి పరీక్షలు రాశారు. ఆ కష్టానికి, సమయపాలనకు, క్రమశిక్షణకు మొదట అభినందనలు తెలపాలి. తల్లిదండ్రులు ఫలితాలు చూడగానే ఎన్ని మార్కులు? అని అడగకూడదు. పరీక్ష బాగా రాశావు, కష్టపడ్డావు అని ముందు పిల్లలను దగ్గరకు తీసుకోవాలి. పక్కవారితో పిల్లలను పోల్చకూడదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఒక్క మాట వారి జీవితాన్నే మార్చేస్తుంది. – రాజేంద్రప్రసాద్, డీఈవో, చిత్తూరు


