చిత్తూరు కార్పొరేషన్: అయ్యా బాబు.. మా కొద్దు ఈ బాబు అంటూ వాణిజ్యపన్నుల(సీటీ)శాఖ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం వాణిజ్య పన్నులశాఖ కార్యాలయం ఎదుట కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసు అసోసియేషన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పూర్ణం, గిరిధర్ మాట్లాడారు. తమశాఖ కమిషనర్ బాబుఅహ్మద్ పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్నరని ఆరోపించారు. దీని పై న్యాయస్థానాన్ని రాష్ట్ర నాయకులు ఆశ్రయించారన్నారు. శాఖపరమైన పదోన్నతులు ఇవ్వకుండా తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడమే అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. వెంటనే వారికి పదోన్నతులు కల్పించాలని ఆదేశాలిచ్చి 6 నెలలు అవుతన్నా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన పదోన్నతులు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. మే 4లోపు తమకు పదోన్నతులు ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సీటీ అటెండర్ల సంఘం రాష్ట్ర సహధ్యక్షుడు సుబ్రమణ్యం పాల్గొన్నారు.


